కువైట్‌లో విలవిల

1 Aug, 2020 07:40 IST|Sakshi
పనులు లేక రూమ్‌కే పరిమితమైన దృశ్యం

మూడు నెలలుగా పనుల్లేక అల్లాడుతున్న జిల్లా వాసులు

చేతులెత్తేసిన అక్కడి కంపెనీ మేనేజ్‌మెంట్‌

ప్రభుత్వం స్పందించి స్వదేశానికి తీసుకురావాలని వేడుకోలు

సంతబొమ్మాళి: బతుకు తెరువు కోసం విదేశాల కు వెళ్లిన వారు కరోనా ప్రభావంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడుతున్నారు. తమ సమస్యలు ఎవరికి ఎప్పుకోవాలో తెలీక, బాధలు వినేవారు లేక ఆందోళన చెందుతున్నారు. సంతబొమ్మాళి మండలంలోని గెద్దలపాడు, పిట్టవానిపేట, గొలుగువానిపేట, ఎం.సున్నాపల్లి, వజ్రపుకొత్తురు మండలం దేవునల్తాడ, పోలా కి మండలం గప్పెడుపేటకు చెందిన సుమారు 200 మంది యువకులు 2018లో కువైట్‌ వెళ్లారు. వెల్డింగ్, రిగ్గర్‌ పనులు చేసుకుంటూ నాలుగు రా ళ్లు వెనకేసుకుంటున్న సమయంలో కరోనా వీరి ఉపాధిని ధ్వంసం చేసింది. కోవిడ్‌ ప్రభావంతో కువైట్‌లో ప్రైవేటు కంపెనీలు పనులు ఆపేశాయి. 

దీంతో మూడు నెలలుగా పనుల్లేక, జీతాలు రాక వీరు అల్లాడిపోతున్నారు. పనులు నిలుపుదల చేసిన మొదటిలో కంపెనీ భోజనాలు పెట్టి నా ఆ తర్వాత చేతులెత్తేసింది. దీంతో దాచుకున్న డబ్బులను వీరంతా ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తుంటే వాటితోనే కడుపు నింపుకుంటున్నారు. కుటుంబాలను పోషించడానికి ఇంత దూరం వస్తే.. మళ్లీ ఆ కుటుంబాలపైనే ఆధార పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వదేశానికి పంపేయండి అని కంపెనీ యాజమాన్యానికి చెప్పినా వారు తమ వల్ల కాదంటూ తెగే సి చెప్పేశారు. దీంతో తల్లిదండ్రులు ఏజెంట్లను సంప్రదించారు. వారిది కూడా అదే మాట. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమను స్వదేశానికి రప్పించాలని బాధితులు ఎరుపల్లి లక్షుమయ్య, చింతలబాలకృష్ణ, చెక్క వేణునాథం, రట్టి చిన్నారావు, చెక్క రాజయ్య తదితరులు కోరుతున్నారు. కరోనా భయం ఓ వైపు తీవ్రంగా ఉందని, అదే సమయంలో ఉపాధి లేక మరోవైపు నలిగిపోతున్నామని, అధికారులు, ప్రభుత్వమే తమపై దయ చూపాలని కోరుతున్నారు. 

ఇబ్బందులు పడుతున్నాం 
బతుకు తెరువు కోసం కువైట్‌ వచ్చాను. కరోనా ప్రభావంతో కంపెనీ పనులను ఆపేసింది. దీంతో జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. యాజమాన్యం కూడా ఏమీ చేయలేక చేతులెత్తే సింది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. 
– ఎరుపల్లి అప్పయ్య, గెద్దలపాడు, సంతబొమ్మాళి మండలం

స్వదేశానికి రప్పించండి 
నాలుగు డబ్బులు సంపాదించడానికి దేశం కాని దేశం వచ్చాను. డ్యూటీ బాగానే ఉన్నా కరోనా ప్రభావంతో అతలాకుతలం అయ్యాము. పనులు సాగక షెడ్డులోనే ఉన్నాము. మూడు నెలలుగా జీతాలు లేవు. స్వదేశానికి పంపించాలని బతిమలాడినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వదేశానికి రప్పించాలని వేడు కుంటున్నాను.
– రట్టి చిన్నారావు, పిట్టవానిపేట, సంతబొమ్మాళి మండలం  

ఇంటి నుంచి డబ్బులు పంపుతున్నాం 
కువైట్‌లో పనిచేయడానికి మా అబ్బాయి లక్ష్మయ్య వెళ్లాడు. మూడు నెలలుగా అక్కడ పనులు లేకపోవడంతో జీతాలు ఇవ్వడం లేదని, ఇ బ్బంది పడతున్నామని ఫోన్‌లో చెప్పాడు. దీంతో ఇంటి నుంచి డబ్బులు పంపాను, ఫ్లయిట్‌ టిక్కెట్‌ కోసం ఏజెంట్‌కు డబ్బులు ఇస్తే, రెండు వారాల తర్వాత మావల్ల కాదని డబ్బులు తిరిగి ఇచ్చేశారు. ప్రభుత్వమే అదుకోవాలి. 
– వై.కుంతెమ్మ, బాదితుడు తల్లి, గెద్దలపాడు 

మరిన్ని వార్తలు