శ్రీశైలం డ్యాం.. అందాలు చూడటానికి సిద్దమా!

22 Jul, 2022 16:15 IST|Sakshi

శ్రీశైలం ప్రాజెక్ట్‌(నంద్యాల జిల్లా): శ్రీశైలం డ్యామ్‌ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుండటంతో శనివారం గేట్లు ఎత్తనున్నారు. గురువారం సాయంత్రానికి డ్యాం నీటి మట్టం 880.20 అడుగులకు చేరుకుంది. మరో 4.80 అడుగులు పెరిగితే గరిష్టస్థాయి 885 అడుగులకు చేరుకుంటుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 1,65,255 క్యూసెక్కుల వరద ప్రవాహం డ్యాంకు వస్తోంది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు సగటున 40 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. 


శనివారం నాటికి జలాశయ నీటిమట్టం 882 అడుగులకు పైబడి చేరుకోనుంది. దీంతో ఆదే రోజు ఉదయం 11 గంటల సమయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శ్రీశైలం ప్రాజెక్ట్‌ చేరుకుని డ్యాం రేడియల్‌క్రస్ట్‌ గేట్లను తెరచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. 


ఇదిలా ఉండగా బ్యాక్‌ వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 10 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 597 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో తాత్కాలికంగా విద్యుత్‌ ఉత్పాదనను నిలిపివేయగా, ఎడమగట్టు కేంద్రంలో ఉత్పాదన కొనసాగుతోంది. (క్లిక్: మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు!)

మరిన్ని వార్తలు