884.80 అడుగులకు చేరిన ‘శ్రీశైలం’ నీటిమట్టం

6 Sep, 2022 05:45 IST|Sakshi
సాగర్‌ జలాశయం

శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురిసౌత్‌: శ్రీశైలం జలాశయం నీటిమట్టం సోమవారం సాయంత్రం 884.80 అడుగులకు చేరుకుంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,19,093 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. మూడు గేట్లను 10 అడుగుల మేర తెరిచి 83,949 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

ఇక ఆదివారం నుంచి సోమవారం వరకు కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం 66,566 క్యూసెక్కులు, స్పిల్‌ వే ద్వారా 95,562 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు. బ్యాక్‌ వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 5 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,688 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ జలాశయంలో 214.3637 టీఎంసీల నీరు నిల్వ ఉంది.  

మరోవైపు సాగర్‌ జలాశయం నుంచి 1,60,129 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌   నీటిమట్టం 589.10 అడుగులుండగా 309.3558 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గరిష్టస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు అయితే.. నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు.  

మరిన్ని వార్తలు