22న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల 

22 Feb, 2023 06:00 IST|Sakshi
తిరుచానూరు ఆలయం వెలుపల కుటుంబ సభ్యులతో హోం మంత్రి వనిత

తిరుమల: మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 22న సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలున్నాయి.

మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత సేవా టికెట్లకు ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ నమోదు ప్రక్రియ 22న ఉదయం 10 గంటల నుంచి 24న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్‌ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి సేవను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. 

సర్వ దర్శనానికి 10 గంటలు 
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. సోమ­వారం అర్ధరాత్రి వరకు 61,374 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీలో రూ.4.20 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు ఉన్నవారికి సకాలంలో, దర్శనం టికెట్లు లేనివారికి 10 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న వారికి 2 గంటల్లో దర్శనమవుతోంది.

కాగా, శ్రీవారిని మంగళవారం ఏపీ హోం మంత్రి తానేటి వనిత, ఇండియన్‌ క్రికెట్‌ క్రీడాకారుడు సూర్యకుమార్‌ యాదవ్, ఎంపీలు ప్రిన్సెస్‌ దియా కుమారి, శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకున్నారు. అలాగే, మంత్రి తానేటి వనిత కుటుంబ సభ్యులతో తిరుచానూరుకు వెళ్లి పద్మావతీ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. 

మరిన్ని వార్తలు