రాయలసీమ కథా కార్యశాల.. అనగానే.. ఏంది కథ? అనుకున్నా.. ఏమిరా వీరశంకర్రెడ్డీ.. దీనివల్ల సమాజానికి లాభం? పొరపాటుగా అలవాటైన సినీ ‘సీమ’యాసలో నన్ను నేను ప్రశ్నించుకున్నా.. నిర్వాహకులకు మోయలేని భారమేమో.. మనుషులు రాకపోతే అవమానమేమో.. నమ్మకంతో కూడిన సందేహం వ్యక్తం చేసుకున్నా.. కడపలో కథా కార్యశాల ముగిసి రెండు వారాలవుతున్నా వదలని ఆ జ్ఞాపకాలు..అనుభూతులు.. అనుభవాలు పై సందేహాలను పటాపంచలు చేశాయి. చంచలమైన మనసుకు జవాబుదారీతనాన్ని నేర్పాయి.
సమాజం నుంచే కథ పుడుతుందని.. కథ వల్ల సమాజం అర్థమవుతుందని.. ఇదే సమాజానికి ప్రయోజనకరమని అవగతమైంది. మంచి కథకు మనుషుల కరువేం లేదని.. వచ్చినోళ్లందరూ గొప్ప రచయితలుగా రూపొందకపోయినా సరికొత్త ‘మనుషులు’గా మారతారని .. మనసులను చూసే దృక్పథం ఒకటి అలవాటవుతుందని.. ‘మనో భార’మితి కనిపెట్టినంత సంతోషం వేసింది. హాజరు కోసం నేను గడిపింది కాసేపే అయినా.. కార్యశాల విజయగాథను వినిపించడానికి చాలా కసరత్తే చేయాల్సి వచ్చింది. కథ రాయడం ఓ కళ అని వర్ణించినా.. దానిని శాస్త్రీయంగా చెప్పి, ఇలా చెప్పడం పేద్ద కళ అని నేర్పకనే నేర్పించారు. రెండు రోజుల ప్రయాణంలో కొత్తదారిని కనుక్కునేలా చేశారు.
– షేక్ ముజుబుద్దీన్, సాక్షి, కడప డెస్క్
కడపలోని విశ్వేశ్వరయ్య భవన్ ప్రాంగణం.. ఈ నెల 17, 18 తేదీల్లో రాయలసీమ కథాకార్యశాలకు విచ్చేసిన అతిరథ మహారచయితలు, భావి కథకులతో కళకళలాడింది. సీమకు చెందిన మూడు తరాల రచయితలతో పాటు కథారచనలో మెళకువలు నేర్చుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 42 మంది వర్తమాన కథకులకు వేదికైంది. లబ్దప్రతిష్టులు జీవితకథలు చెప్పేందుకు ఈ కార్యశాల పాఠశాలలా మారింది. ప్రసిద్ధ కథకులు డా.కేతు విశ్వనాథ్ రెడ్డి, షేక్ హుస్సేన్ సత్యాగ్ని, బండి నారాయణ స్వామి, శాంతి నారాయణల చేతుల మీదుగా కార్యశాల ప్రారంభమైంది. ప్రసిద్ధ కథకులు, విమర్శకులు.. శాంతి నారాయణ, దాదాహయాత్, డా.మేడిపల్లి రవికుమార్, పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి, జి.ఉమామహేశ్వర్, డా.వి.ఆర్.రాసాని, శ్రీనివాసమూర్తి, యోగివేమన యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.ఎన్.ఈశ్వర్ రెడ్డి, యువ పరిశోధకులు డా.తవ్వా వెంకటయ్య తదితరుల అనుభవాలకు సజీవశిల్పంలా నిలిచింది. చివర్లో ప్రసిద్ధ రచయిత డా.బండి నారాయణ స్వామితో కథారచన మెళకువలపై ముఖాముఖి నడిచింది. మొత్తానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి కథాకార్యశాల సాహితీలోకంలో సరికొత్త పరిమళాలు వెదజల్లింది. యువ కథకుల భవిష్యత్తుకు భరోసానిచ్చింది.
పేరుకు రాయలసీమ అని పెట్టినా.. గుంటూరు, ప్రకాశం, వైజాగ్, హైదారాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఔత్సాహికులు హాజరు కావడం కార్యశాల ప్రాధాన్యత తెలిపింది. రాయలసీమ కథా కార్యశాలే కాదు.. ఇపుడు హైదరాబాద్ బుక్ఫెయిర్ కూడా విశేషంగా విజయవంతం కావడం.. తెలుగు సాహిత్యం ఎన్నటికీ సుసంపన్నమేనని స్పష్టతనిస్తోంది. 2022 వెళుతూ వెళుతూ సాహితీపంట పడించింది. 2023 తెలుగింట కథల పండుగ తెస్తుందని చెప్పింది.
ఉపసంహారం
ఇలాంటి కథా కార్యశాలలు మరిన్ని జరగాలి. ప్రతి చోటా నిర్వహించాలి. తద్వారా ప్రతి వ్యక్తి ఒక సంస్కారి కావాలి. ఇంటింటా సాహిత్యం విరబూయాలి. పుస్తక పఠనం మరింత పెరగాలి. ఈ డిజిటల్ యుగంలో ప్రతి మనసు ఒక పుస్తకమై పరిమళించాలి. ఆపాదమస్తకం అనుభూతించాలి. కొత్తకథకు జీవితమవ్వాలి.
కథకు(డికి) ఉండాల్సిన లక్షణాలు