సీఎం జగన్‌ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

22 Sep, 2020 07:06 IST|Sakshi

ఏఎస్‌ఎల్‌ సమావేశంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ మార్కండేయులు 

సాక్షి, చిత్తూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ మార్కండేయులు ఆదేశించారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో సోమవారం ఏఎస్‌ఎల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టు వ్రస్తాలను సమర్పించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23, 24 తేదీల్లో తిరుమల పర్యటనకు రానునున్నట్లు తెలిపారు. 23న మధ్యాహ్నం 3.05 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయ లుదేరి 3.50 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి బేడి ఆంజనేయస్వా మి ఆలయానికి చేరుకుని, శ్రీవారికి పట్టువ్రస్తాలను సమర్పిస్తారన్నారు.

ఉత్సవాల్లో పాల్గొని, తర్వాత అతిథి గృహంలో బస చేస్తారని, 24న ఉదయం 6.25 గంటలకు మరోమారు వెంకన్నను దర్శించుకుని, తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారని తెలిపారు. అలాగే బెంగళూరు నుంచి కర్ణాటక సీఎం యడ్యూరప్ప ఈనెల 23న సాయంత్రం తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి తిరుమలకు రోడ్డు మార్గంలో వెళతారన్నారు. వారి పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు ఐజీ శశిధర్‌రెడ్డి జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు.  (డైనమిక్‌ సీఎం వైఎస్‌ జగన్‌)

అలాగే రోడ్డు మార్గంలో శానిటేషన్‌ చర్యలు, ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం కోసం వచ్చే ప్రతినిధుల కోసం ప్రత్యేక బారికేడ్ల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. తరువాత ముఖ్యమంత్రి ప్రయాణించనున్న రోడ్డు మార్గంలో ట్రయల్‌రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ సురేష్‌, తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డి, తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ గిరీష, డీఎస్పీ చంద్రశేఖర్, ఎయిర్‌పోర్ట్‌ సీఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ శివప్రసాద్, కిరణ్‌కుమార్, రుయా సూపరిండెంటెండ్‌ భారతి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు