విమానాశ్రయం (గన్నవరం): కరోనా నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం నుంచి ఆంక్షలను కఠినతరం చేశారు. విమానాశ్రయంలోకి సందర్శకుల అనుమతిని నిలిపివేశారు. ప్రయాణికులతో పాటు కారు డ్రైవర్ను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. ప్రయాణికులకు స్వాగతం, వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ఎయిర్పోర్ట్ ప్రధాన ద్వారం వద్ద నిలిపివేస్తున్నారు. టెర్మినల్ భవనం వద్ద కూడా ప్రయాణికులను థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతే లోపలికి పంపిస్తున్నారు.
ఇక ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణికులకు మాత్రమే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇకపై దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు. పాజిటివ్గా నిర్ధారణ అయితే క్వారంటైన్ సెంటర్లకు తరలించే విధంగా చర్యలు చేపట్టారు.