రాష్ట్రంలో బలీయంగా లేబొరేటరీ వ్యవస్థ

6 Aug, 2020 03:09 IST|Sakshi

మూడు నెలల్లోనే 14 వైరాలజీ ల్యాబ్‌ల ఏర్పాటు

అవసరాన్ని బట్టి కొత్తగా మరో ఎనిమిది ల్యాబ్‌లు 

డ్రగ్‌ టెస్టింగ్‌ లేబొరేటరీలపైన సర్కార్‌ దృష్టి

వీటితో నాసిరకం మందులకు చెక్‌

సాక్షి, అమరావతి: వ్యాధులు రావడానికి మూల కారణాలు గుర్తించాలంటే వైరాలజీ ల్యాబ్‌లు ఉండాల్సిందే. మార్చికి ముందు వరకు తిరుపతిలో మాత్రమే వైరాలజీ ల్యాబ్‌ ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 14కు చేరింది. జిల్లాకు ఒకటి చొప్పున, చిత్తూరు జిల్లాలో రెండు చొప్పున ల్యాబ్‌లు ఉన్నాయి. కరోనా నియంత్రణ దిశగా వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పటిష్ట చర్యలు తీసుకోవడంతో మిలియన్‌ జనాభా ప్రాతిపదికన అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఇప్పటికే రికార్డులకెక్కింది. ఈ విషయంలో పెద్ద రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనాను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. తాజాగా డ్రగ్‌ టెస్టింగ్‌ లేబొరేటరీలపైన దృష్టి సారించింది. మందుల నాణ్యత పరిశీలనకు వీటిని యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 

దేశంలో 10.40 శాతం టెస్టులు ఇక్కడే..
► దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల్లో 10.40 శాతం మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. 
► దేశంలో ప్రతి 100 టెస్టుల్లో 10కి పైగా రాష్ట్రంలోనే చేస్తున్నారు. 
► ఇప్పటివరకు దేశంలో 2 కోట్లకు పైగా టెస్టులు చేయగా.. అందులో 22 లక్షల పరీక్షలు ఏపీలోనే జరిగాయి.
► రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో 16 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు
► వీటితో పెరగనున్న ఎంబీబీబీస్‌ సీట్లు, ల్యాబ్‌లు
► అవసరాన్ని బట్టి మరో ఏడెనిమిది కొత్త లేబొరేటరీలు వస్తాయంటున్న అధికారులు
► ల్యాబ్‌లతోవ్యాధుల నిర్ధారణలో జాప్యం నివారించవచ్చు.
► తద్వారా రోగికి సత్వరమే వైద్యం
► కర్నూలు, విశాఖపట్నంలలో డ్రగ్‌ టెస్టింగ్‌ లేబొరేటరీలు
► ప్రస్తుతం విజయవాడలో మందుల నాణ్యతను పరిశీలించే ల్యాబ్‌ ఉంది.
► దీనికి ఏడాదికి 3 వేల నుంచి 4 వేల లోపు మందుల నాణ్యతను పరిశీలించే సామర్థ్యం ఉంది. 
► ఇప్పుడా సామర్థ్యాన్ని 10 వేల నమూనాలను పరిశీలించేలా పెంచుతున్నారు.
► కర్నూలు, విశాఖపట్నంలలో డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
► దీనివల్ల మందుల నాణ్యత నిర్ధారణలో జాప్యం జరగదు.
► నాసిరకం మందులకు చెక్‌ పెట్టొచ్చు.

మరిన్ని వార్తలు