Kolagatla Veerabhadra Swamy: కార్యకర్త నుంచి డిప్యూటీ స్పీకర్‌ వరకు...

20 Sep, 2022 11:20 IST|Sakshi

విజయనగరం: సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కోలగట్ల వీరభధ్రస్వామి డిప్యూటీ స్పీకర్‌ హోదా వరకు వ్యక్తిగతంగా ఎదిగారు. పాలన లో తనదైన ముద్రవేస్తూ.. ప్రశంసలు అందుకుంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎమ్మె ల్సీగా ఎన్నికైన ఆయనకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొద్ది నెలల కిందట డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల పేరును సీఎం ప్రకటించారు. ప్రస్తు తం జరుగుతున్న శాసనసభా సమావేశాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

సీఎంతో పాటు స్పీకర్‌ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రివర్గం సమక్షంలో ఆయన డిప్యూటీ స్పీకర్‌ పీఠాన్ని సోమవారం అధిరోహించారు. కోలగట్ల 1983లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అనంతరం 1985లో కోపరేటివ్‌ బ్యాంకు డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. 1987లో మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికకాగా, 1989లో కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1989, 1994, 1999 సంవత్సరాల్లో విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ 2004 సంవత్సరం ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజుపై విజయం సాధించారు.

 2013 సంవత్సరంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2014 సంవత్సరంలో ఎమ్మెల్సీ పదవితోపాటు ఆ పార్టీకి రాజీనామాచేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షునిగా, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. అదే ఏడాది విజయనగరం శాసనసభా నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందగా... వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం విజయనగరం ఎమ్మెల్యేగా,  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ గా కొనసాగుతున్నారు.  

ప్రత్యేక గుర్తింపు..  
విజయనగరానికి చెందిన పూసపాటి వంశీయులపై రాజకీయంగా పోరాడి విజయం సాధించడంతో ఎమ్మెల్యే కోలగట్లకు ప్రత్యేక గుర్తింపు లభించింది. సుమారు 7 మార్లు ఎమ్మెల్యేగా, పలు శాఖల రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా పదవులు అధిరోహించిన పూసపాటి అశోక్‌గజపతిరాజుపై స్వతంత్య్ర అభ్యరి్థగా ఒకసారి, వైఎస్సార్‌సీపీ తరఫున మరో సారి పోటీచేసి తన సత్తాను నిరూపించుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. కార్పొరేషన్‌ హోదా దక్కించుకున్న విజయనగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా సాగుతున్నారు.  

అభినందనల జల్లు..  
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కోలగట్లవీరభధ్రస్వామికి అభినందనలు వెల్లువెత్తాయి. విజయనగరం జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు,, జిల్లా ఎస్సీసెల్‌ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, చనమల్లు వెంకటరమణ, రాష్ట్ర పర్యాటకశాఖ డైరెక్టర్‌ రేగాన శ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు కుప్పం ప్రసాద్‌ ద్వారకానాథ్, గుబ్బ చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం   కలి్పంచిన సీఎంకు తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిసి కోలగట్ల వీరభద్రస్వామి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


 

మరిన్ని వార్తలు