అమ్మ, పాప కోనేటిలో దూకుతున్నారు..రా తాతా..!

26 Sep, 2020 06:56 IST|Sakshi
తల్లి నుంచి తప్పించుకుని తాత చెంతకు చేరిన వరుణ్‌తేజ్‌

బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య

కుటుంబకలహాలే కారణం

చీరకొంగు విడిపించుకుని తప్పించున్న కుమారుడు 

సాక్షి, చిత్తూరు: కుటుంబ కలహాలతో బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఊటబావులపల్లెలో చోటుచేసుంది. స్థానికుల కథనం.. ఊటబావులపల్లెకు చెందిన సురేష్‌(32), కృష్ణవేణి(24) భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు వరుణ్‌తేజ్‌(6), హర్షిత(3) ఉన్నారు. కూలిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు పరిపాటి అయ్యాయి. దీంతో శుక్రవారం సాయంత్రం మనస్తాపం చెందిన కృష్ణవేణి ఇద్దరి పిల్లలను వెంటతీసుకుని గ్రామానికి అరకిలోమీటరు దూరంలోని దేవళంగుట్టపైకి వెళ్లింది. ఇద్దరి పిల్లలను చీరకొంగుకు చుట్టుకుని  కోనేటిలో దూకేందుకు యత్నించింది.

అయితే వరుణ్‌తేజ్‌ విడిపించుకుని గుట్టపై నుంచి కేకలు వేస్తూ తన తాత మునిరత్నం వద్దకు వచ్చాడు. ‘అమ్మా పాప కోనేటిలో దూకుతున్నారు..రా తాతా..’ అంటూ బిగ్గరగా ఏడ్చాడు. స్థానికులను, మనవడిని వెంటబెట్టుకొని పరుగున ఆ వృద్ధుడు కోనేటి వద్దకు వెళ్లేసరికి అప్పటికే కృష్ణవేణి తన కుమార్తెతో సహా విగతజీవురాలై ఉండటం చూసి గుండెలవిసేలా రోదించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్‌ అధికారులు సంఘటనా స్థలానికి  చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. (పెళ్లయిన 9 నెలలకే..)

మరిన్ని వార్తలు