జూలై 4 నుంచి పునఃప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మే 6 నుంచి జూలై 3 వరకు ప్రభుత్వం పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. జూలై 4న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 4 లోగా 1–9 తరగతుల విద్యార్థులకు పరీక్షల నిర్వహణను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆ తర్వాత టీచర్లు పరీక్షల మూల్యాంకనం పూర్తి చేయాలి. మే 5న ఇంగ్లిష్ లాంగ్వేజ్, వొకాబులరీపై విద్యార్థులకు బేస్లైన్ టెస్టు నిర్వహిస్తారు. ఆ తర్వాత మే 6 నుంచి జూలై 3 వరకు విద్యార్థులకు సెలవులు ఇచ్చినా పాఠశాలలు మే 20 వరకు కొనసాగనున్నాయి. టీచర్లు మే 20 వరకు విధులకు హాజరవ్వాలి. పదో తరగతి పరీక్షలు, మూల్యాంకనం, మార్కులు, ఇతర సమాచారం అప్లోడింగ్ తదితరాల దృష్ట్యా 20 వరకు స్కూళ్లు కొనసాగనున్నాయని కమిషనర్ వివరించారు.