రాష్ట్ర సమానాభివృద్ధి కోసమే మా పోరాటం

25 Nov, 2020 04:41 IST|Sakshi
దీక్షలో పాల్గొన్న దళిత సంఘాల నేతలు

56వ రోజుకు మూడు రాజధానుల మద్దతు దీక్షలు

తాడికొండ: మూడు రాజధానుల ఏర్పాటుతో ఏపీకి కలిగే ప్రయోజనాలు, సమానాభివృద్ధి కోసమే తమ పోరాటమని బహుజన పరిరక్షణ సమితి నేతలు స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం, తామూ అడ్డు కాదనే నిజం చంద్రబాబుకు తెలిసినా రైతులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. 3 రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో కొనసాగుతున్న 56వ రోజు దీక్షలకు మంగళవారం సమితి నేతలు, మహిళలు భారీగా హాజరయ్యారు. నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు కోర్టుల ద్వారా 3 రాజధానులను అడ్డుకోవడం దారుణమన్నారు.

అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్‌ ముందుకెళుతుంటే బాబుకు భవిష్యత్తులో పుట్టగతులు ఉండవనే భయం పట్టుకుందన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో 32 వేల ఎకరాల భూములిచ్చిన రైతుల మేలు ఈ జన్మలో మర్చిపోను అని చెప్పి పూలింగ్‌ ముగిశాక రైతులకు చిప్ప చేతికిచ్చారని దుయ్యబట్టారు. ఇకనైనా తప్పులు ఒప్పుకొని 3 రాజధానుల నిర్ణయానికి కట్టుబడాలని, లేకుంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.  

>
మరిన్ని వార్తలు