జీవో నెం.1పై సుప్రీంకోర్టులో విచారణ.. హైకోర్టుకు ఆదేశాలు

20 Jan, 2023 12:34 IST|Sakshi

న్యూఢిల్లీ: జీవో నెం.1 పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. హైకోర్టులో విచారణ ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల23న జీవో నెం 1పై హైకోర్టు విచారణ జరపాలని ఆదేశించింది. ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ విచారణ జరపాలని పేర్కొంది.

కాగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.1పై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలో దీనిపై శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. 

రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలపై విచారించే పరిధి వెకేషన్ బెంచ్‌కు లేదని కోర్టుకు తెలిపారు. తనకు లేని పరిధిలో వెకేషన్ బెంచ్ తీర్పు చెప్పిందని వాదించారు. ఉదయం 10:30కు కేసును మెన్షన్ చేసి.. ప్రతివాదుల వాదనలు వినకుండానే అదే రోజున తీర్పు వెల్లడించారని పేర్కొన్నారు. 

ఏపీ ప్రభుత్వ వాదనను తన ఉత్తర్వులలో రికార్డు చేసిన సీజేఐ డీవై చంద్రచూడ్.. కేసు మెరిట్స్ లోపలికి  వెళ్లడం లేదని తెలిపారు.  హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని అన్నారు.

ఏపీ ప్రభుత్వ పిటిషన్‌లోని ముఖ్యమైన అంశాలు
►బహిరంగ సభలను నిషేధిస్తున్నట్లు జీవోలో ఎక్కడ ఒక పదం కూడా లేదు 
►చంద్రబాబు సభల్లో 11 మంది చనిపోయారు, సభలను అడ్డగోలుగా నిర్వహించారు
►ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది
►సభలపై అవసరమైన మేరకు మాత్రమే నియంత్రణలు విధించాం 
►జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులలో బహిరంగ సభలు పెట్టొద్దని కోరాం 
►ప్రత్యామ్నాయ ప్రాంతాలలో స్థలాలలో సభలు పెట్టుకోవాలని కోరాం

మరిన్ని వార్తలు