ఏపీ హైకోర్టుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

1 Oct, 2020 13:36 IST|Sakshi

తుళ్లూరు మాజీ తహశీల్దార్‌ కేసును వారంలోగా తేల్చండి

హైకోర్టును ఆదేశించిన సుప్రీంకోర్టు

సాక్షి, ఢిల్లీ: తుళ్లూరు మాజీ తహశీల్దార్ అన్నే సుధీర్ బాబు కేసును వారంలోగా తేల్చాలని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు వారాల తర్వాత విచారణ చేయనుంది. హైకోర్టు ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంలో కేసు ఏమిటని హైకోర్టు వ్యాఖ్యలు ఎలా చేస్తుందని అత్యున్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. దర్యాప్తుపై స్టే విధించొద్దని అనేక సార్లు చెబుతూనే వస్తున్నాం. చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఉండాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. (చదవండి: ఏబీకి ఎదురు దెబ్బ)

తుళ్లూరు భూ కుంభకోణంలో మాజీ తహసీల్దార్‌ సుధీర్‌బాబు సహా పలువురిపై సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించగా, హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వచ్చే వారం ఈ అంశంపై విచారణ ముగించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ రైతులను బెదిరించి మాజీ తహశీల్దార్‌ అన్నే సుధీర్ బాబు, బ్రహ్మానంద రెడ్డి అసైన్డ్  భూములను లాక్కున్న సంగతి తెలిసిందే. తమకు భూములు ఇవ్వకుంటే ల్యాండ్ పూలింగ్ లో భూములు పోగొట్టుకోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. ల్యాండ్ పూలింగ్ పథకం అమలు కంటే ముందే పేదల భూముల బదలాయింపు బెదిరింపులకు భయపడి పేద రైతులు తమ భూములను అమ్ముకున్నారు. ఆ భూములను టీడీపీ నేతలు తమ సొంతం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు