Andhra Pradesh: సరోగసి చట్టం అమలుకు ప్రత్యేక బోర్డు

12 Jul, 2022 11:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సరోగసీ చట్టం–2021, అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ చట్టం–2021 అమలుకు ప్రభుత్వం ప్రత్యేక బోర్డు, రాష్ట్ర, జిల్లా అథారిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. బోర్డుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వివిధ విభాగాల కమిషనర్లు, డైరెక్టర్లు, నిపుణులు సభ్యులుగా ఉంటారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్‌ శ్రీదేవి, బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధలను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.

రాష్ట్ర అథారిటీకి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌/డైరెక్టర్‌ చైర్మన్‌గా, అడిషనల్‌ డైరెక్టర్‌ (ఎంసీహెచ్‌) వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ముగ్గురు సభ్యులు కూడా ఉంటారు. జిల్లా స్థాయిల్లో అథారిటీకి కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఎంహెచ్‌వో వైస్‌ చైర్మన్‌గా ఉంటారు. మరో ముగ్గురు సభ్యులు ఉంటారు. సరోగసి, కృత్రిమ గర్భధారణ పేరుతో జరుగుతున్న వ్యాపార ధోరణిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఈ చట్టాలను తెచ్చింది.

మరిన్ని వార్తలు