బుసిరెడ్డి శ్వేత.. కొలువుల్లో ఘనత.. వరుసగా మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

4 Nov, 2022 09:00 IST|Sakshi
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న బుసిరెడ్డి శ్వేత  

సాక్షి, వైఎస్సార్‌ కడప(వైవీయూ): కడప నగరానికి చెందిన బుసిరెడ్డి శ్వేత వరుసగా మూడో కేంద్ర ప్రభుత్వ కొలువు సాధించింది. కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యులు డా. బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాగేశ్వరి దంపతుల కుమార్తె అయిన శ్వేత ప్రస్తుతం భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో బెంగళూరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తోంది.

ఈమె ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్‌ గ్రాడ్యుయల్‌ లెవల్‌–2019లో ఆలిండియా స్థాయిలో 410వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. కాగా 2020లో బ్యాంక్‌ పరీక్షల్లో అర్హత సాధించి బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా విడుదలైన ఎస్‌ఎస్‌స్సీ సీజీఎల్‌–2022 పరీక్షా ఫలితాల్లో ఆలిండియాస్థాయిలో 998వ ర్యాంకు సాధించింది. దీంతో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవిన్యూ, సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ కార్యాలయంలో ప్రివెంటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రణాళికబద్ధంగా చదవడంతోనే వరుసగా కొలువులు సాధించిగలిగినట్లు ఆమె తెలిపారు. కాగా వీరి స్వస్థలం చింతకొమ్మదిన్నె మండలం గూడవాండ్లపల్లె కాగా, ప్రస్తుతం కడప నగరంలోని రాజీవ్‌మార్గ్‌ సమీపంలో నివాసం ఉన్నారు. ఈమె పదోతరగతి వరకు నాగార్జున మోడల్‌ స్కూల్‌లోను, ఇంటర్‌ కడప నారాయణ, బీటెక్‌ హైదరాబాద్‌లోని నారాయణమ్మ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదివారు. శ్వేతకు ఉత్తమ ర్యాంకు లభించడం పట్ల కుటుంబసభ్యులు అభినందనలు తెలిపారు. 

మరిన్ని వార్తలు