జేసీ ప్రభాకర్‌రెడ్డికి తాడిపత్రి డీఎస్పీ వార్నింగ్‌!

7 Aug, 2020 20:17 IST|Sakshi

సాక్షి, అనంతపూర్‌: విధుల్లో ఉన్న పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ పట్ల టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించడంపై తాడిపత్రి డీఎస్పీ ఎ.శ్రీనివాసులు స్పందించారు. నిజాయతీగా పనిచేస్తున్న పోలీసులపై దాడి చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. పోలీసుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని, చట్టపరంగా తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్‌ ఇచ్చారు. అందరూ చట్టప్రకారం నడుచుకోవాల్సిందేనని హితవు పలికారు. జైలు నుంచి విడుదలయ్యాక ర్యాలీ చేయొవద్దని జేసీ ఫ్యామిలీకి నిన్ననే చెప్పామని డీఎస్పీ గుర్తు చేశారు. అయినా, జేసీ వర్గీయులు అవేమీ పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ దేవేంద్రపై జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారని, సీఐ ఫిర్యాదు మేరకు జేసీపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల్ని కూడా ఉల్లంఘించారని అన్నారు.
(చదవండి: ఏపీలో కొత్తగా 10,171 పాజిటివ్‌, 89 మంది మృతి)

‘500 మందితో జేసీ ఊరేగింపు జరిపారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా కాల్చారు. వీడియో క్లిప్పింగ్స్, ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఐదు కేసులు నమోదు చేశాం’అని డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. కాగా,  వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌ రెడ్డి కొద్ది రోజుల కిందట అరెస్టయిన సంగతి తెలిసిందే. కండీషన్‌ బెయిల్‌పై వారిద్దరూ గురువారం క‌డ‌ప సెంట్ర‌ల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈక్రమంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిప‌త్రి వర‌కు అనుచ‌ర‌గ‌ణంతో ర్యాలీగా వ‌చ్చారు. సీఐ దేవేంద్ర‌ను ప‌బ్లిక్‌గా బెదిరించారు. దీంతో సీఐ ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించిన జేసీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దీంతోపాటు కడప నుంచి తాడిపత్రి వరకు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా జేసీపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
(దురుసు ప్రవర్తన, జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్‌)

మరిన్ని వార్తలు