మార్షల్స్‌పై టీడీపీ సభ్యుల దాడి ఎథిక్స్‌ కమిటీకి..

3 Dec, 2020 04:21 IST|Sakshi

స్పీకర్‌ తమ్మినేని ప్రకటన 

సాక్షి, అమరావతి: మార్షల్స్‌పై టీడీపీ సభ్యులు దాడి చేసి అమానుషంగా ప్రవర్తించిన తీరును ఎథిక్స్‌ కమిటీకి రిఫర్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. మంగళవారం టీడీపీ సభ్యుల్ని సస్పెండ్‌ చేసినప్పుడు మార్షల్స్‌ వచ్చి సభ వెలుపలికి తీసుకెళ్లే సమయంలో వారిపై విపక్ష టీడీపీ సభ్యులు చేయి చేసుకోవడం పట్ల స్పీకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్‌ తమ్మినేని బుధవారం సభలో మాట్లాడుతూ శాసనసభలో జరిగిన ఉదంతం చాలా దురదృష్టకరమన్నారు. సభ తీసుకునే నిర్ణయాన్ని మార్షల్స్‌ అమలు చేస్తారన్నారు.

శాసనసభ్యులుగా సభలో అడుగుపెట్టినప్పుడే సభ నియమాలు, సంప్రదాయాలకు కట్టుబడి సభ్యులు వ్యవహరించాలని, అయితే గడిచిన మూడు రోజులుగా సభ జరుగుతున్న తీరు ఆక్షేపణీయమని అన్నారు. తమ పట్ల టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు గురించి మార్షల్స్‌ తనను కలసి వినతిపత్రం ఇచ్చారని, వారి పట్ల టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై బుధవారం ఉదయం శాసనసభ వ్యవహారాల మంత్రితో మాట్లాడానని, విచారణ జరిపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సభ నిర్ణయించినట్లు స్పీకర్‌ చెప్పారు. 

>
మరిన్ని వార్తలు