పార్లమెంటు సమావేశ వివరాల కోసం ప్రత్యేక యాప్
కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో స్పీకర్ తమ్మినేని
సాక్షి, అమరావతి: దేశ, రాష్ట్ర చట్టసభల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషిస్తోందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) వినియోగించడం ద్వారా కాగితం అవసరం లేకుండా చట్టసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలోను, శాసనమండలిలోను పూర్తిస్థాయిలో కంప్యూటరైజేషన్ను అమలు చేస్తున్నామన్నారు. టెక్నాలజీ ద్వారానే కోవిడ్ సమయంలో 15వ చట్టసభలనుద్దేశించి గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించే వెసులుబాటు కలిగిందని చెప్పారు.
కెనడాలో జరుగుతున్న 65వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ వర్క్షాప్లో గురువారం ఆయన కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో శాసనసభ కార్యకలాపాలను, ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలు, రూల్ ఆఫ్ లా వంటి అంశాల్లో పాటిస్తున్న విధానాలను వివరించారు. చట్టాల రూపకల్పనలో సభ్యుల మధ్య జరిగే లోతైన చర్చలతో సరికొత్త విషయ ఆవిష్కరణ జరుగుతున్న తీరును తెలిపారు.
దేశంలో లోక్సభ, రాజ్యసభల్లో టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.738 కోట్లతో నేషనల్ ఈ–విధాన్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా పార్లమెంటు ప్రొసీడింగ్స్, ప్రశ్నోత్తరాలు, చర్చలు ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. చట్టసభల నిర్వహణలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోందన్నారు.