ఏపీలో పెట్టుబడులకు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఆసక్తి 

31 Aug, 2022 03:29 IST|Sakshi
సీఎం జగన్‌కు విమానం నమూనాను అందజేస్తున్న టాటా ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ హెడ్‌ మసూద్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఆ సంస్థ ప్రతినిధుల భేటీ 

రక్షణ, వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాలపై చర్చ

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సంస్థ కార్పొరేట్‌ ఎఫైర్స్, రెగ్యులేటరీ హెడ్‌ జె.శ్రీధర్, టాటా ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ హెడ్‌ మసూద్‌ హుస్సేనీలు సీఎంను కలిసి ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు.

రక్షణ,  వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై కూడా వారి మధ్య చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్‌ వారికి చెప్పారు. పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను ఆయన వారికి వివరించారు.

సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం తెలిపారు. సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు