-

ఏపీ పాలిటిక్స్‌లో ‘మూడు ముక్కలాట’

28 Jun, 2022 08:57 IST|Sakshi

రాజకీయ సిద్ధాంతాలు వేరైనా రహస్య ఎజెండా ఒకటిగా పెట్టుకొని విపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. బీజేపీ ఛీ కొడుతున్నా.. టీడీపీ అంతర్గతంగా సహకరిస్తూ లోపాయికారి రాజకీయం చేస్తోంది. బద్వేల్, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఈ తెర చాటు రాజకీయం తెరపైకి వచ్చింది. పదవిలో ఉండి కాలం చేసిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు పోటీచేస్తే టీడీపీ పోటీ చేయదని అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటిస్తారు. ఎన్నికల్లో ఆ పార్టీ శ్రేణులు పోటీ చేసిన బీజేపీకి చురుగ్గా సహకరిస్తాయి. కుట్ర రాజకీయాలు చేయడంలో టీడీపీకి వెన్నతో పెట్టిన విద్యగా పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మూడు ముక్కలాట తెరపై కనిపిచింది.   

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం తొలుత కాంగ్రెస్‌కు, ఆ తర్వాత వైఎస్సార్‌సీసీకి కంచుకోటగా నిలుస్తోంది. ప్రజామద్దతు చూరగొని రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచి మంత్రి అయిన మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. పార్టీ సిద్ధాంతం ప్రకారం ఉప ఎన్నికల్లో ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు పోటీచేస్తే టీడీపీ పోటీ చేయదంటూ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. బద్వేల్‌లో దివంగత ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్‌ సుధా పోటీ చేసింది. ఆత్మకూరులో మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీ చేశారు. రెండు చోట్ల టీడీపీ అభ్యర్థిని బరిలో దింపలేదు. అయితే బీజేపీకి పోలింగ్‌ ఏజెంట్లుగా టీడీపీ కార్యకర్తలు, నేతలు పని చేయడం చూస్తే రెండు పారీ్టల రహస్య ఎజెండా అర్థమవుతోంది.    

బీజేపీకి.. జనసేన, టీడీపీ ప్రత్యక్ష సహకారం 
2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన మద్దతుతో అధికారంలోకి వచ్చిన టీడీపీ అరాచక పాలన సాగించింది. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీని బీజేపీ ఛీత్కరించింది. ఈ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ప్రజా మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమయ్యాయి. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షోభాలు ఎదురైనా.. చిత్తశుద్ధితో పేదలకు సంక్షేమ పాలన అందిస్తుండడంతో వైఎస్సార్‌సీపీ అపార ప్రజామద్దతు పెంచుకుంది. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీని నిలువరించడం కష్ట సాధ్యమని తెలుసుకున్న విపక్షాలు అంతర్గతంగా చేతులు కలుపుతున్నాయి.

టీడీపీ బహిర్గతంగా బీజేపీ ఛీ కొట్టింది. అయినా అంతర్గతంగా బీజేపీకి లోపాయకారి మద్దతు ఇస్తూ టీడీపీ రహస్య ఎజెండాను అమలు చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఉప ఎన్నికల పోలింగ్‌లో తెర వెనుక రాజకీయాలకు తెర తీసిన టీడీపీ.. ఆఖరి క్షణంలో తెరపైకి ప్రత్యక్షమైయ్యారు. పోలింగ్‌ ఏజెంట్లుగా టీడీపీ వర్గీయులు అవతరించారు. జనసేన నేతలు సైతం అదే ధోరణి ప్రదర్శించారు. బీజేపీకి అండగా ప్రచార పర్వం నుంచి పోలింగ్‌ దాకా సహకారమందించారు.

2019 సాధారణ ఎన్నికల్లో 2,314 ఓట్లతో 1.33 శాతానికి పరిమితమైన బీజేపీ, 2022 ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీల సహకారంతో 19,353 ఓట్లతో 14.1 శాతం ఓటు షేర్‌ దక్కిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. బీజేపీకి రెండు పార్టీల నేతలు సహకరించినా ఓటింగ్‌ శాతం ఈ స్థాయికి పరిమితం కావడంతో చూస్తే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేసినా.. ఒంటరిగా పోటీ చేసినా.. ఆ పారీ్టలకు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేసిస్తున్నారు.    

మేకపాటి మంచితనానికి ఆత్మకూరు ప్రజల జేజేలు
ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 74.47 శాతం ఓట్లు దక్కాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన, అర్హులందరికీ చిత్తశుద్ధితో ప్రభుత్వ పథకాలు అందిస్తున్న తీరు, మేకపాటి గౌతమ్‌రెడ్డి మంచి తనం ఉప ఎన్నికల్లో ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని పరిశీలకులు చెబుతున్నారు. 2014లో అత్యధిక మెజార్టీ రికార్డు మేకపాటి గౌతమ్‌రెడ్డికి దక్కగా, ఆ జాబితాలో తొలి స్థానాన్ని మేకపాటి విక్రమ్‌రెడ్డి తిరగరాశారు. 82,888 ఓట్లు మెజార్టీ సాధించి భారీ రికార్డును మేకపాటి విక్రమ్‌రెడ్డి వశ పర్చుకుని, తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సోదరడు దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించనున్నారు. 

ఇది కూడా చదవండి: వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యం

మరిన్ని వార్తలు