టీడీపీకి మరో షాక్‌.. వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

7 Apr, 2021 20:12 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా, బాపట్ల మాజీ ఎమ్మెల్యే ఆనంతవర్మ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. మంతెన ఆనంతవర్మ..1999లో టీడీపీ నుంచి బాపట్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీఎం జగన్‌ పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను ముఖ్యమంత్రి అయ్యాక తూచ తప్పకుండా పరిష్కరిస్తున్నారని, ఆయనలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తత్వం తనను ఆకర్శితున్ని చేసిందని, అందుకే పార్టీలో చేరానని పేర్కొన్నాడు. 

రాష్ట్రంలో సీఎం జగన్‌ నాయకత్వంలో సంక్షేమ పాలన నడుస్తుందని కొనియాడారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారని, దీంతో టీడీపీ పని అయిపోయిందని వెల్లడించారు. టీడీపీ తరఫున నిలబడేందుకు అభ్యర్ధులు లేకే, పరిషత్ ఎన్నికలు బహిష్కరించాలని ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు సందిగ్ధ స్థితిలో ఉన్నారని, త్వరలో టీడీపీ ఖాళీ అవనుందని, మరో 30 ఏళ్లు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉంటారని ఆయన జోస్యం చెప్పారు. 

మరిన్ని వార్తలు