కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన జేసీ

10 Mar, 2021 04:01 IST|Sakshi
కార్యకర్తపై చేయి చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి   

సాక్షి, తాడిపత్రి (అనంతపురం): అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఓ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. జేసీ ప్రభాకరరెడ్డి అనుచరులతో కలిసి మెయిన్‌ బజార్‌లో ఎన్నికల ప్రచారానికి బయలుదేరగా.. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రచారానికి గుంపుగా వెళ్లకూడదని పోలీసులు ఆయనకు చెప్పారు.

అయినా వినకుండా ప్రచారం చేపట్టడంతో మార్గమధ్యంలో డీఎస్పీ వీఎన్‌కే చైతన్య మరోసారి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పైగా అరెస్ట్‌ చేస్తారా.. చేయండి అంటూ ఆవేశంతో ఊగిపోయారు. నడుచుకుంటూ కాకుండా ప్రచార వాహనంలో వెళ్లాలని పోలీసులు సూచించినా వినిపించుకోలేదు. ఇంతలో టీడీపీ కార్యకర్త రఘునాథ్‌రెడ్డి కల్పించుకుని పోలీసులు చెప్పినట్టు చేద్దాం అనడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి బండబూతులు తిడుతూ ఆయనపై పలుమార్లు చేయి చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు