ఏపీ అసెంబ్లీ.. స్పీకర్‌పై టీడీపీ సభ్యుల దాడి.. అడ్డొచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేపైన కూడా..

20 Mar, 2023 10:16 IST|Sakshi

సాక్షి, అమరావతి:టీడీపీ సభ్యుల తీరు రోజురోజుకూ శ్రుతిమించుతోంది. సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే కాక.. ఏకంగా సహచర సభ్యులు, స్పీకర్‌ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఏడో రోజు సభ కొలువైంది. అయితే, ప్రశ్నోత్తరాల సమయం నుంచే టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించి దౌర్జన్యానికి దిగారు.స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌పై టీడీపీ సభ్యులు దాడికి పాల్పడ్డారు.

స్పీకర్‌ చైర్‌ ఎక్కి ఆయన ముఖంపై ఫ్లకార్డులు అడ్డుగా పెట్టారు. పేపర్లు చింపి ఆయనపై విసిరేశారు.  తమ్మినేని ఎంత విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించారు. సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్‌కు రక్షణగా పోడియం వద్దకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చేరుకున్నారు. వారిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.

ఎమ్మెల్యే సుధాకర్‌ బాబుపై దూషణలకు దిగారు. వారించిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ను గోరంట్ల బుచ్చయ్య చౌదరి నెట్టేశారు. దీంతో వెల్లంపల్లి కిందపడబోయారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి దూషించారు. పచ్చపార్టీ నేతల తీరును వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ఇది బ్లాక్‌ డే గా అభిప్రాయపడ్డారు.
చదవండి: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

మరిన్ని వార్తలు