వైఎస్సార్‌ సీపీలోకి గొట్టిపాటి అనుచరుడు 

8 Sep, 2020 11:03 IST|Sakshi
రామారావుకు పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌ సీపీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి బాలినేని, బాచిన కృష్ణచైతన్య 

400 కుటుంబాలతో కలిసి మాజీ జెడ్పీటీసీ చింతా చేరిక 

పార్టీ కండువా వేసి ఆహ్వానించిన మంత్రి బాలినేని

సంతమాగులూరు మండలంలో టీడీపీకి షాక్‌ 

సంతమాగులూరు: మండలంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత కొన్నేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు అనుచరుడిగా ఉన్న మండలంలోని వెల్లలచెరువు గ్రామానికి చెందిన టీడీపీ నేత, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చింతా రామారావు సోమవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. అతని వర్గానికి చెందిన సుమారు 400 కుటుంబాలతో కలిసి విజయవాడలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య  సమక్షంలో వైఎస్సార్‌ సీపీ కండువా వేయించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నట్లు రామారావు పేర్కొన్నారు.

వైఎస్సార్‌ సీపీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు అన్ని వర్గాల ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులు సైతం ఆకర్షితులై వైఎస్సార్‌ సీపీలో చేరడం అభినందనీయమని అన్నారు. అనంతరం చింతా రామారావు తన వర్గీయులతో కలిసి బాచిన కృష్ణచైతన్య, గరటయ్యలను పూలమాలలతో సన్మానించారు. రామారావు వెంట మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ బొల్లినేని రామకృష్ణ, ఊట్ల నాగేశ్వరరావు, చింతా శ్రీధర్, సూరే రామ్మోహనరావు, పమిడి కోటేశ్వరరావు, బొడ్డుపల్లి మల్లేశ్వరి, రాష్ట్ర బీసీ నాయకులు బల్లిపల్లి కొండలు, లక్ష్మారెడ్డి కోటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు