టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్‌

11 Mar, 2021 08:44 IST|Sakshi

విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐపై చేయి చేసుకున్న కొల్లు రవీంద్ర

సాక్షి, మచిలీపట్నం: మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్‌ చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐపై చేయి చేసుకున్న కొల్లు రవీంద్రపై కేసు నమోదైంది. ఆయనను ఇనుకుదురు పీఎస్‌కు పోలీసులు తరలించారు. కొల్లు రవీంద్రపై 506, 341, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొల్లు రవీంద్ర బుధవారం పోలింగ్‌ సెంటర్‌ వద్ద వీరంగం సృష్టించిన సంగతి విదితమే. ఓటింగ్‌ ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పాటు, తనను పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నందుకు ఏకంగా విధుల్లో ఉన్న ఎస్‌ఐపై చేయి చేసుకున్నారు.

మచిలిపట్నం 25వ డివిజన్‌ సర్కిల్‌పేటలోని పోలింగ్‌ కేంద్రానికి టీడీపీ నేత కొల్లు రవీంద్ర, మరి కొందరి కార్యకర్తలతో కలిసి వచ్చారు. తాను లోపలికి వెళ్లి పోలింగ్‌ సరళిని పరిశీలించాలంటూ హాడావుడి చేసే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు 144 సెక్షన్‌ అమల్లో ఉందని..  ఆయన లోపలికి వెళ్లడానికి కుదరదని కొల్లు రవీంద్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.  ఈ క్రమంలో కొల్లు రవీంద్ర.. పోలీసులపై విరుచుకుపడ్డాడు.. ‘‘ఏయ్‌ ఎస్పై నన్ను ఆపుతావా’’ అంటూ బెదిరించడమే కాక.. ‘‘చంపుతావా.. చంపు’’ అంటూ ఎస్‌ఐ మీదకు వెళ్లాడు. వారిని వెనక్కి నెట్టాడు. నేను లోపలికి వెళ్లి పోలింగ్‌ సరళిని పరిశీలించాలంటూ వారితో వాదనకు దిగారు.


చదవండి:
ఏయ్‌ ఎస్సై నన్నే ఆపుతావా: కొల్లు రవీంద్ర
చంద్రబాబు జాతి నాయకుడే

మరిన్ని వార్తలు