టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్‌

23 Feb, 2023 04:20 IST|Sakshi
పట్టాభిని రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలిస్తున్న పోలీసులు

మొత్తం 11 మంది రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలింపు

పట్టాభి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు

విజయవాడ జీజీహెచ్‌ వైద్యుల ధ్రువీకరణ

మెడికల్‌ సర్టిఫికెట్‌ను కోర్టులో సమర్పించిన పోలీసులు

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం సీఐ పి.కనకా­రావుపై రాళ్లతో దాడి చేసి గాయప­రచడం­తోపాటు హత్యాయత్నానికి అనుచరు­లను ప్రేరేపించిన కేసులో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు బుధ­వారం కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది. పోలీసుల సమాచారం మేరకు.. ఈ కేసులో 11 మంది నిందితులను మంగళవారం గన్నవరంలోని అద­నపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పోలీసులు హాజ­రుపరిచిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పది మందికి కోర్టు రిమాండ్‌ విధించింది. అయితే తనపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని జడ్జి ఎదుట పట్టాభి ఆరోపించారు. దీంతో ఆయనకు విజయవాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించి తిరిగి కోర్టులో హాజరుప­రచా­లని జడ్జి శిరీష పోలీ­సులను ఆదేశించారు. ఈ మేరకు పట్టాభికి విజ­య­వాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన పోలీసు­లు బుధవారం కోర్టుకు తీసుకువచ్చారు.

పట్టాభి చేతులకు సాధారణ గాయాలు మినహా శరీరంపై కొత్త గాయాలు ఏమీ లేవని జీజీహెచ్‌ వైద్యులు ఇచ్చిన మెడికల్‌ సర్టిఫికెట్‌ను కోర్టులో ఆయనకు చదివి వినిపించారు. మెడికల్‌ సర్టిఫికెట్‌­పై పట్టాభి కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

అయితే రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు కాకుండా మిగిలిన నిందితులు ఉన్న గన్నవరం సబ్‌­జైలుకు తనను రిమాండ్‌కు పంపించాలని పట్టాభి కోర్టు­ను అభ్యర్థించారు. దీంతో ఆయనకు 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఉత్త­ర్వులు ఇచ్చారు.

అనంతరం పోలీసులు పట్టా­భిని గన్నవరం సబ్‌ జైలుకు తరలించారు. అయితే సబ్‌ జైలులో పరిమితికి మించి ఖైదీలు ఉండటంతో వీర­ం­దరినీ వేరే జైలుకు పంపించాలని జైలర్‌ యూనస్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వడంతో పట్టాభితో­పాటు మరో పది మంది నిందితులను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు పోలీసులు తరలించారు. 

మరిన్ని వార్తలు