గ్రామ వలంటీర్‌పై టీడీపీ నేతల హత్యాయత్నం

2 Jan, 2023 09:36 IST|Sakshi

కత్తితో దాడి చేయడంతో వలంటీర్‌కు తీవ్రగాయాలు

తిరుపతి జిల్లా ఇనగలూరులో ఘటన

శ్రీకాళహస్తి రూరల్‌(తిరుపతి జిల్లా): గ్రామ వలంటీర్‌పై టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో వలంటీర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రాత్రి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఇనగలూరులో జరిగింది. వివరాలు.. ఇనగలూరుకు చెందిన అంతటి రామరాఘవేంద్ర గ్రామ వలంటీర్‌గా సేవలందిస్తున్నాడు.

అతను చురుగ్గా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకందిస్తుండటం స్థానిక టీడీపీ నాయకులకు నచ్చేది కాదు. ‘ఎందుకు అంతా నీదే అన్నట్లు చేస్తున్నావ్‌.. జాగ్రత్త’ అంటూ పలుమార్లు అతన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు చెలికం మోహన్‌రెడ్డి, జడపల్లి రాఘవ, నడవాలి చిరంజీవి శనివారం రాత్రి వలంటీర్‌ ఇంటి ముందుకు వచ్చి టపాసులు కాల్చారు. నిప్పు రవ్వలు ఎగిరి వలంటీర్‌ రాఘవేంద్ర పిల్లల మీద పడ్డాయి. దీంతో కొంచెం దూరం వెళ్లి టపాసులు కాల్చుకోవాలని వలంటీర్‌ చెప్పడంతో.. టీడీపీ నాయకులు ముగ్గురూ కలిసి విచక్షణారహితంగా దాడి చేశారు. రాఘవేంద్ర భయపడిపోయి పరిగెత్తగా.. వెంటపడి కత్తితో దాడి చేశారు. ఇంతలో స్థానికులు అక్కడికి రావడంతో.. టీడీపీ నాయకులు ముగ్గురూ పారిపోయారు. తీవ్రంగా గాయపడిన వలంటీర్‌ను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు.   

మరిన్ని వార్తలు