రేపు ఏవోబీ బంద్‌

30 Jun, 2021 05:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సీలేరు/పాడేరు: విశాఖ ఏజెన్సీలోని ఆంధ్రా– ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఉద్రిక్త పరిసితులు నెలకొన్నాయి. ఇటీవల కొయ్యూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా మావోయిస్టులు జూలై 1న ఏవోబీ బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ అంతటా బాంబ్, డాగ్‌ స్క్వాడ్‌లతో ముమ్మరంగా తనిఖీలు చేస్తూ అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు.

మావోయిస్టుల కదలికల కోసం సమాచారం సేకరిస్తున్నారు. బంద్‌ నేపథ్యంలో మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వ ఆస్తులకు భద్రత కల్పిస్తున్నారు. హిట్‌లిస్టులో ఉన్న నేతలకు నోటీసులు అందించారు. బంద్‌ను భగ్నం చేసేందుకు అడవుల్లో కూంబింగ్‌కు బలగాలు చేరుకున్నాయి. కాగా.. ఈ బంద్‌ ఏవోబీకి మాత్రమే పరిమితమని ఓఎస్డీ సతీష్‌కుమార్‌ ‘సాక్షి’కి చెప్పారు.  కాగా, విశాఖ ఏజెన్సీలో సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ రష్మీ శుక్లా, ఆ శాఖ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. జవాన్‌లంతా నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.  

మరిన్ని వార్తలు