6 నుంచి పది అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

7 Jun, 2022 05:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జూలై 6 నుంచి 15వ తేదీవరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం టెన్త్‌ ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీవరకు గడువు ఉందని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో జూన్‌ 21వ తేదీ నుంచి ఆయా సబ్జెక్టుల పరీక్ష తేదీకి ఒక రోజుముందు వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. 

విద్యార్థులకు ఊరట కల్పిస్తూ..
కరోనా కారణంగా చదువులు సరిగా ముందుకు సాగక విద్యార్థులు  కొంత నష్టపోయిన నేపథ్యంలో వారికి ఊరట కల్పించేలా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు ఎన్ని మార్కులు సాధించినా వారిని కంపార్టుమెంటల్‌ పాస్‌ కింద కాకుండా పరీక్షలో ఆయా విద్యార్థులు సాధించే మార్కులను యథాతథంగా పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్‌ పరీక్షల మాదిరిగానే వారికి డివిజన్‌లను కేటాయించనున్నామని మంత్రి వివరించారు. 

► ఉత్తీర్ణులైన అభ్యర్థుల మార్కులకు సంబంధించి షార్ట్‌ మెమోలను రెండు రోజుల అనంతరం www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నారు. ఈ మెమోల ద్వారా విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు పొందవచ్చు.
► ఫెయిలైన వారి వివరాలను  మంగళవారం అధి కారిక వెబ్‌సైట్‌లో పొందుపరచనుంది. 
► విత్‌హెల్డ్‌లో ఉన్న వారి ఫలితాలను ఆయా జిల్లాలనుంచి సమాచారం అందిన అనంతరం ప్రకటించనున్నారు.  
► రీ కౌంటింగ్‌ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించి 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. 

► రీ వెరిఫికేషన్, జవాబు పత్రాల ఫొటోస్టాట్‌ కాపీల కోసం ఒక్కో పేపర్‌కు రూ.1,000 చొప్పున  ఈనెల 20వ తేదీలోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. 
► రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసేవారు రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లే దు. రీ వెరిఫికేషన్‌లో మార్కుల రీ కౌంటింగ్‌తో పాటు సమాధానాలు రాసిన అంశాలన్నిటికీ మార్కులు వేశారా? లేదా? అనేది పరిశీలన చే స్తారు. ఒకవేళ ప్రశ్నలకు సమాధానాలు రాసినా వాటికి మార్కులు ఇవ్వకుంటే ఆ ప్రశ్నల సమాధానాలను రీ వాల్యుయేషన్‌ చేసి మార్కులు కేటాయిస్తారు. రీ వెరిఫికేషన్లో ఆయా సమాధానాల రీ కరెక్షన్‌కు అవకాశం ఉండదు. అలాంటి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోరు.  

మరిన్ని వార్తలు