భోజనం నాణ్యత విషయంలో రాజీ లేదు

9 Dec, 2021 04:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అధికారులతో విద్యా శాఖ మంత్రి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా మెనూ సక్రమంగా అమలు కావడం లేదని ఫిర్యాదు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బుధవారం అధికారులతో మాట్లాడుతూ.. ఇటీవల కొన్నిచోట్ల వస్తున్న ఫిర్యాదులను ఉన్నతాధికారులు పరిశీలించి నివేదిక అందించాలని కోరారు. భోజనం బిల్లులు రాలేదని కొందరు చెబుతున్నారని.. వాటిని సకాలంలో పోర్టల్‌లో ఎందుకు పొందుపరచలేకపోయారని ప్రశ్నించారు.

అన్ని జిల్లాల్లో బకాయిల వివరాలను వెంటనే పోర్టల్‌లో పొందుపరిచి నివేదిక ఇవ్వాలన్నారు. త్వరలోనే వాటిని మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రకాశం జిల్లా దర్శి, కడప జిల్లా కాజీపేట పాఠశాలల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తక్షణమే నివేదికివ్వాలని ఆదేశించారు. కొన్నిచోట్ల టీచర్ల మధ్య అంతర్గత విభేదాలతో అసత్య కథనాలు బయటకు వస్తున్నాయని, ఇలాంటి వివాదాలకు కారణమైన టీచర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీల పర్యవేక్షణకు అధికారులతో త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు