ఓం ప్రతాప్‌ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు 

29 Aug, 2020 05:46 IST|Sakshi
మాట్లాడుతున్న ఎస్పీ సెంథిల్‌కుమార్, పక్కన మృతుడి తల్లిదండ్రులు ఆదెమ్మ, శ్రీనివాసులు

సాక్ష్యాలు ఉంటే అందజేయాలని ప్రతిపక్ష నాయకులకు ఎస్పీ సెంథిల్‌ సూచన

పుంగనూరు (చిత్తూరు జిల్లా): సోమల మండలం పెద్దకాడ హరిజనవాడలో మృతి చెందిన ఓంప్రతాప్‌ (28) మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, ఆయనది సహజ మరణమేనని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శుక్రవారం ఆయన మృతుడి తండ్రి శ్రీనివాసులు, చిన్నాన్న వెంకటరమణ, తల్లి జాదెమ్మ, సోదరుడు ఓంప్రకాష్‌ల ఇళ్లకి వెళ్లి పరామర్శించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

► ఓంప్రతాప్‌ మృతిపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టింగ్‌లు అన్నీ వాస్తవాలు కాదు.
► అలాగే, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఎమ్మెల్సీ లోకేశ్, టీడీపీ నాయకుడు వర్ల రామయ్యల ఆరోపణల్లోనూ వాస్తవం లేదు.
► ఓం ప్రతాప్‌ మృతిపై ప్రతిపక్ష నాయకుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు ఉన్నా అందజేస్తే చర్యలు తీసుకుంటాం.
► ఓంప్రతాప్‌ మాటలను కొంతమంది రికార్డు చేసి, దురుద్దేశంతోనే సోషల్‌ మీడియాలో పెట్టారు. ఓంప్రతాప్‌ ఎలాంటి పోస్టులు పెట్టలేదు. దీనిపైనా దర్యాప్తు చేపడుతున్నాం. ► సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారాలతో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.  
► సమావేశంలో మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, తహశీల్దార్‌ శ్యాంప్రసాద్‌రెడ్డి, సీఐలు మధుసూదనరెడ్డి, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు