సాక్షి, తిరుపతి : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రతీ ఏటా దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. కానీ ఈసారి మాత్రం కరోనా కారణంగా ఏర్పాట్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు. అధిక మాసం కారణంగా ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 19 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనుండగా అక్టోబర్ 16న నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సెప్టెంబరు 18న అంకురార్పణతో మొదలైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27న చక్రస్నానంతో ముగియనున్నాయి.
ఇప్పటికే టీటీడీ ఉద్యోగుల్లో 743మంది కరోనా బారిన పడగా ఓ అర్చకుడు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 402 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా, మరికొంత మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. దర్శనానికి వచ్చే భక్తుల విషయంలో తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. అన్లాక్లో భాగంగా దర్శానాలకు అనుమతించినప్పటి నుంచి తిరుమలలో కరోనా కేసులు పెరగుతున్నాయి. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో భక్తుల రాక కూడా తగ్గిపోయింది. ప్రతీరోజు లక్షల్లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ప్రస్తుతం రోజుకు గరిష్టంగా 8వేల మందికి తగ్గింది. వచ్చే నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల దృష్ట్యా భక్తులు పెరిగే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.