ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న కరోనా 

10 May, 2021 08:20 IST|Sakshi
జీవీవీఎస్‌శర్మ

రాజానగరం: కరోనా మహమ్మారి పచ్చని కుటుంబాలను కకావికలం చేస్తోంది. కొన్ని కుటుంబాలపై కక్ష కడుతోంది. లాలాచెరువు హెచ్‌బీ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు 10 రోజుల వ్యవధిలో కరోనా వైరస్‌తో మృతిచెందడం కాలనీవాసులను తీవ్రంగా కలచివేస్తుంది. రాజమహేంద్రవరంలో నటరాజు, శివజ్యోతి థియేటర్లకు మేనేజర్‌గా పనిచేస్తున్న జీవీవీఎస్‌శర్మ అనే నటరాజశర్మ (75) కరోనా వైరస్‌తో ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు.

ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం కలిగిన శర్మ పిల్లలు ముగ్గురికి వివాహాలు చేశారు. ఈ సంతానంలో 10 రోజుల క్రితం పెద్దమ్మాయి (45), ఐదు రోజుల క్రితం చిన్నమ్మాయి (32), కరోనా వైరస్‌తో చికిత్స పొందుతూనే మరణించారు. ప్రస్తుతం శర్మ భార్య హోమ్‌క్వారంటైన్‌లో ఉన్నారు. వేదమాత బ్రహ్మణ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉన్న ఆయన అయ్యప్పస్వామి మాల దీక్ష ధరించి, 36 సంవత్సరాల నుంచి శబరిమలై వెళ్లి వస్తూ, గురుస్వామిగా పేరొందారు. నటరాజ థియేటర్‌ మేనేజర్‌గా ఉండటంతో అంతా నటరాజశర్మ అని పిలిచేవారు. శర్మ మరణం పట్ల మాజీ సర్పంచ్, వైఎస్సార్‌ సీపీ నాయకుడు మెట్ల ఏసుపాదం తదితరులు విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు.

చదవండి: అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు  
అమ్మకు కేక్‌ కొనాలని వెళ్తూ..

మరిన్ని వార్తలు