ఏప్రిల్‌ 24 నుంచి తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు

21 Apr, 2021 17:11 IST|Sakshi

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 24 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ కారణంగా రెండోరోజు నిర్వహించే స్వర్ణ రథోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.

వసంత రుతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవం’అని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించి వివిధ ఫలాలను స్వామికి నివేదిస్తారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లు ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. 


శ్రీవారి సేవకుల స్వచ్ఛంద సేవలు నిలుపుదల 
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు స్వచ్ఛందంగా పాల్గొనే శ్రీవారి సేవను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి సేవకు వచ్చే వలంటీర్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. తదుపరి శ్రీవారి సేవ ప్రారంభమయ్యే తేదీలను ముందుగానే తెలియజేస్తామని తెలిపింది. ఏప్రిల్, మే, జూన్‌ మాసాల్లో శ్రీవారి సేవకు రాదలచిన వలంటీర్లు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది.

ఇక్కడ చదవండి:
హన్మంతుని జన్మస్థలంపై ఆధారాలు ప్రకటించిన టీటీడీ

భక్తులకు మరింత సులభతరంగా ‘తిరుమల’ గదులు

మరిన్ని వార్తలు