శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరణ

14 Sep, 2022 18:42 IST|Sakshi

సాక్షి, తిరుపతి: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల బుక్‌లెట్లను ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆవిష్కరించారు. తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల ఈవో కార్యాల‌యంలో ఆవిష్క‌రించారు. సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5 వ‌రకు సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. సెప్టెంబ‌రు 20న ఉద‌యం 6 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. సెప్టెంబ‌రు 26న రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం జ‌రుగ‌నుంది. బ్రహ్మోత్సవాల్లో ప్ర‌ధానంగా అక్టోబరు 1న గరుడవాహనం, అక్టోబరు 2న స్వర్ణరథం, అక్టోబరు 4న ర‌థోత్స‌వం, అక్టోబరు 5న చక్రస్నానం జరుగనున్నాయి.

వాహనసేవల వివరాలు..
సెప్టెంబరు 27న మొద‌టి రోజు సాయంత్రం 5.45 నుండి 6.15  గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు పెద్ద శేష వాహనం.
సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హంస వాహనం.
సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ముత్యపు పందిరి వాహనం.
సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల వాహనం.
అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనం.
అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ర‌థ‌రంగ డోలోత్సవం(స్వ‌ర్ణ‌ రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు గజ వాహనం.
అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చంద్రప్రభ వాహనం.
అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అశ్వ వాహనం.
అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ధ్వజావరోహణం.

మరిన్ని వార్తలు