ఒక్కసారిగా టమాట ధరలు పైపైకి 

7 Sep, 2022 13:53 IST|Sakshi

ఖరీఫ్‌ సీజన్‌ చివరికి చేరడంతో తగ్గుతున్న దిగుబడి 

రైతు బజార్‌లో కిలో రూ. 28, బయటి మార్కెట్‌లో 30కి పైనే  

సాక్షి, కడప: ఖరీఫ్‌లో సాగు చేసిన టమాట పంట ప్రస్తుతం చివరి దశకు చేరడంతో దిగుబడులు తగ్గాయి. దీంతోపాటు మార్కెట్‌కు సరుకు తక్కువగా వస్తుండటంతో ధర కొంచెం కొంచెం ఎగబాకుతోంది. ఆగస్టు 1న రైతు బజారులో కిలో కిలో రూ.11 ఉండేది. అది కాస్త కాస్తా పెరుగుతూ ప్రస్తుతం కిలో రూ. 28 పలుకుతోంది. బయటి మార్కెట్‌లో 30కి పైగా ఉంది.

జిల్లాలో 470 ఎకరాల్లో.. 
జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 470 ఎకరాల్లో టమాట సాగు చేశారు. మైలవరం, కలసపాడు, ఎర్రగుంట్ల, ఖాజీపేట, సింహాద్రిపురం, వీఎన్‌పల్లె, లింగాల, తొండూరు, సికేదిన్నె, పెండ్లిమర్రి, చక్రాయపేట మండలాల పరిధిలో ఎక్కువగా వేశారు. ఈ పంట ఈ నెల చివరి కంటే ముందే ముగియనుంది. దీంతో ఒక్కసారిగా టమాట ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. జూలైలో 20 నుంచి 25 తేదీల్లో కిలో 10 రూపాయలకే దొరికిన టమాట.. ప్రస్తుతం కిలో రూ.28 నుంచి రూ.32 దాకా ఉంది. రానురాను ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతు బజార్‌లోని కూరగాయల షాపుల నిర్వాహకులు తెలిపారు.  

చదవండి: (స్థపతి వడయార్‌కు స్వర్ణ కంకణం బహూకరించిన సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు