తల్లడిల్లి తనువు చాలించింది

27 Jul, 2020 04:00 IST|Sakshi
హైమావతి (పైల్‌)

కరోనాతో కుమారుడి మృతి 

ముఖం చాటేసిన బంధువులు 

అంతిమ సంస్కారాలు చేసిన సామాజిక కార్యకర్తలు  

మనోవేదనతో ఓ అమ్మ ఆత్మహత్య  

నాగాయలంక(అవనిగడ్డ): పాపం.. ఆ తల్లి గుండె తల్లడిల్లింది.. బిడ్డను కరోనా బలితీసుకున్నా అయిన వారు అక్కరకు రాలేదు.. ఇంట్లోనే 16 గంటల పాటు కుమారుడి మృతదేహం ఉన్నా వారు పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా ఇరుగుపొరుగు సూటిపోటి మాటలు ఆ మాతృ హృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి. అంతే  కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన కృష్ణా జిల్లా నాగాయలంకలో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ చల్లా కృష్ణ కథనం మేరకు..  

► తలశిల హైమావతి(62) కుమారుడు(42) కరోనాతో ఈ నెల 23న మృతి చెందాడు.  
► బంధువులెవరూ ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు చొరవతో ఎస్‌ఐ కృష్ణ, డిప్యూటీ తహసీల్దార్‌ బి.సుబ్బారావు, సామాజిక కార్యకర్తలు తలశిల రఘుశేఖర్, కనిగంటి వెంకటనారాయణతో పాటు హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సొసైటీ సభ్యులు ఆ మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.  
► ఈ ఘటన ఆ తల్లి హృదయాన్ని తల్లడిల్లేలా చేసింది. అదే రోజు ఉదయం కోడలికి చేసిన టెస్ట్‌లో పాజిటివ్‌ రావడం, అయిన వారి పలుకరింపు కరువవడంతో ఆ అమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది.  
► ఉదయం నుంచి హైమావతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆదివారం సాయంత్రం టి.కొత్తపాలెం శివారు మరియపురం వద్ద కృష్ణానదిలో హైమావతి మృతదేహం బయట పడింది.

మరిన్ని వార్తలు