గేట్ల ట్రయల్ రన్ విజయవంతం

26 Mar, 2021 18:54 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పోలవరం ప్రాజెక్టులో మరో కీలక అంకం పూర్తయ్యింది. గేట్ల ట్రయన్‌ రన్‌ విజయవంతమైంది. మొత్తం 48 గేట్లకు గానూ 34గేట్ల అమరిక పనులు, మొత్తం 96 సిలిండర్లకు గానూ 56 సిలిండర్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. 24 పవర్ ప్యాక్ లకు గానూ 5పవర్ ప్యాక్‌లు బిగింపు పూర్తయ్యింది. ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో రెండు గేట్లను ఎత్తవచ్చు.

10 రివర్ స్లూయిజ్ గేట్లకు గానూ 10గేట్ల అమరిక, 3 రివర్ స్లూయిజ్ గేట్లకు సిలిండర్ల అమర్చడం పూర్తి అయింది. ఇప్పటికే 44,43వ గేట్లకు కిందకి పైకి ఎత్తడంతో ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదటిగా 44వ గేటును 6 మీటర్లు పైకి ఎత్తి మరలా 3 మీటర్లు కిందకి అధికారులు దించారు. హైడ్రాలిక్ సిలిండర్ సాయంతో గేటును నిమిషానికి 1.5మీటర్లు ఎత్తే విధంగా రూపొందించారు. 2400 టన్నుల వత్తిడిని సైతం తట్టుకునేలా గేట్ల డిజైన్ చేశారు.ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మిగతా గేట్లను ఎత్తేందుకు చురుగ్గా పనులు సాగుతున్నాయి. గేట్ల ట్రయల్ రన్ పనులను పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ జీఎంలు సతీష్ బాబు, మిశ్రా,బెకెం ఇంజనీరింగ్ సంస్థ ప్రాజెక్ట్ ఇంచార్జి ఎ.నాగేంద్ర పరిశీలించారు.


చదవండి:
ట్రాకింగ్‌ మెకానిజం పటిష్టంగా ఉండాలి: సీఎం జగన్‌
‘ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఇది..’‌

మరిన్ని వార్తలు