రూ. 23.78 కోట్ల జీఎస్టీ రద్దు చేయండి

16 Sep, 2020 05:14 IST|Sakshi
కేంద్రమంత్రి నిర్మలాను కలిసిన వైవీ సుబ్బారెడ్డి

కేంద్ర ఆర్థిక మంత్రికి టీటీడీ చైర్మన్‌ వినతి 

సాక్షి, న్యూఢిల్లీ/ తిరుపతి సెంట్రల్‌: తిరుమల ఆలయ భద్రత కోసం నియమించుకున్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌) విభాగానికి 2014 ఏప్రిల్‌ 1 నుంచి 2020 జూన్‌ 30వ తేదీ వరకు బకాయి ఉన్న రూ.23.78 కోట్ల జీఎస్టీని రద్దు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. 

► జీఎస్టీ రద్దు చేయడం వల్ల టీటీడీకి మరింత ఆర్థిక బలం లభించి అనేక సామాజిక, విద్య, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించే అవకాశం కలుగుతుందని వైవీ పేర్కొన్నారు. 
► తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించిన రద్దయిన రూ.1,000, రూ.500 నోట్లను రిజర్వు బ్యాంకులో గానీ లేదా ఏ ఇతర బ్యాంకుల్లోనైనా డిపాజిట్‌ చేయడానికి అనుమతించాలని వైవీ సుబ్బారెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు. 
► భక్తుల నుంచి రూ.1.8 లక్షల రూ.1000 నోట్లు, రూ.6.34 లక్షల రూ.500 నోట్లు హుండీ ద్వారా కానుకలుగా వచ్చాయన్నారు. పాతనోట్ల మార్పిడి అంశానికి సంబంధించి టీటీడీ అనేకసార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకుకు విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన రాలేదని ఆయన వివరించారు.  

మరిన్ని వార్తలు