ఆన్‌లైన్‌లో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు 

5 Nov, 2020 08:21 IST|Sakshi

తిరుపతి సెంట్రల్‌: టీటీడీ 2021 క్యాలెండర్లు, డైరీలను టీటీడీ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌లోనూ బుక్‌ చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.  వీటిని పోస్టు ద్వారా కూడా భక్తులు పొందవచ్చు. ఇందుకోసం ‘ఈవో, టీటీడీ, తిరుపతి’ పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి ‘ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్, కెటీ.రోడ్, తిరుపతి’ అనే చిరునామాకు పంపాలి. టు పే విధానం (పోస్టల్‌ చార్జీలు అదనం) ద్వారా భక్తులకు క్యాలెండర్, డైరీలను టీటీడీ పంపనుంది. మరింత సమాచారం కోసం 0877– 2264209, 9963955585 నంబర్లను సంప్రదించాలి. (చదవండి: లోక కళ్యాణార్థం టీటీడీలో అఖండ పారాయణం)

టీటీడీ మరో కీలక నిర్ణయం..
ఆన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌తో మూసివేసిన మార్గాలను పునరుద్ధరిస్తుంది. గురువారం నుండి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అయితే, దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే నడకదారిలో అనుమతిస్తామని చెబుతున్నారు. టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ సిబ్బందితో నడకదారిలో ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మెట్ల మార్గాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు. అలాగే రెండు ఘాట్ రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు.

పూర్వ కాలం నుంచి తిరుమల కొండకు రెండు సోపాన మార్గాలున్నాయి. మొదటిది శ్రీవారి మెట్టు. దీన్నే నూరు మెట్ల దారి అంటారు. ఇది శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వర ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. ఈ మార్గం గుండా భక్తులను అనుమతినిస్తున్నట్లు టీటీడీ సెక్యూరిటీ అధికారి గోపినాధ్ జెట్టి పేర్కొన్నారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని సివియస్ఓ గోపినాధ్ జెట్టి తనిఖీ చేశారు. లాక్‌డౌన్‌లో కృర మృగాలు మెట్ల మార్గంలో వస్తుండటంతో శ్రీవారి మెట్లను గతంలో మూసి వేశారు. నేడు భక్తులు సంఖ్య పెరగడంతో మెట్ల మార్గాన్ని ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసారు. 

మరిన్ని వార్తలు