TTD: టీటీడీ సేవలన్నింటికీ ఒకే యాప్‌

9 Oct, 2021 04:46 IST|Sakshi

సాక్షి, తిరుమల(చిత్తూరు): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అందించే సేవల వివరాలన్నీ ఒకే యాప్‌లో పొందు పరిచేందుకు జియో సంస్థతో దేవస్థానం అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. తిరుమల అన్నమయ్య భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి సమక్షంలో అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, జియో ప్రతినిధి అనీష్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు.

అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కోవిడ్‌ పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌ ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు జారీచేయడంతో ఒకేసారి లక్షలాది మంది భక్తులు ప్రయత్నించడంతో టీటీడీ సర్వర్లలో సమస్యలు తలెత్తాయని చెప్పారు. వీటిని అధిగమించేందుకు జియో సంస్థ సహకారం తీసుకున్నామన్నారు. టీటీ డీకి సంబంధించిన సమస్త సేవలు, సమాచారం ఒకేచోట లభించేలా జియో ప్రత్యేకంగా ఒక యాప్‌ తయారు చేయడానికి ముందుకొచ్చిందని ఆయన తెలిపారు.

ఇందులో భక్తులకు అవసరమైన వసతి, దర్శనం లాంటి సకల సేవలు అందుబాటులో ఉంటాయ న్నారు. రాబోయే వైకుంఠ ఏకాదశి రోజున ఈ యాప్‌ను ఆవిష్కరించేలా ఏర్పాటు చేయాలని చైర్మన్‌ కోరారు. ఐదేళ్లుగా టీటీడీకి ఉచితంగా సాంకేతిక సహకారం అందిస్తున్న టీసీఎస్‌ సమన్వ యంతో జియో సంస్థ ఉచితంగా టీటీడీ ఐటీ విభాగానికి మెరుగైన సేవలు అందిస్తోందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు