డిసెంబర్ 31 వరకు వెసులుబాటు
తిరుమల: దర్శన టికెట్ల రద్దు, రీఫండ్కు టీటీడీ మరో అవకాశాన్ని కల్పించింది. ఈ ఏడాది మార్చి 13 నుంచి జూన్ 30 వరకు ఆన్లైన్ కౌంటర్ల ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకున్న భక్తులు వాటిని రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్ని రీఫండ్ పొందేందుకు డిసెంబర్ 31 వరకు అవకాశం కల్పించింది. టికెట్ వివరాలు, బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ను ఎక్సెల్ ఫార్మాట్లో refunddesk_1@tirumala.org మెయిల్ ఐడీకి పంపాలి. కాగా, టీటీడీ 2021 డైరీలు, క్యాలెండర్లను www.tirupatibalaji.ap.gov.in ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే, తిరుమల నాదనీరాజనం వేదికపై నవంబర్ 3 నుంచి ఆరో విడత సుందరకాండ అఖండ పారాయణాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.
శ్రీవారి సేవలో సునీల్ దియోధర్
శ్రీవారిని ఏపీ బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ దియోధర్ బుధవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. సునీల్ మాట్లాడుతూ..శేషాచలంలో పెరిగే ఎర్రచందనం మొక్కలను కాపాడేందుకు కేంద్ర బలగాల సాయం కోరాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు.