దర్శనం టికెట్లతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు: టీటీడీ

26 Jul, 2021 03:38 IST|Sakshi

రేవతి పద్మావతి ట్రావెల్స్‌పై కేసు 

తిరుమల: శ్రీవారి దర్శనం టికెట్లు, సేవా టికెట్ల పేరుతో వ్యాపారం చేసే దళారులు, ట్రావెల్స్‌ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెలా 20వ తేదీ ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది దళారులు, ట్రావెల్స్‌ సంస్థలు తాము దర్శనం టికెట్లు బుక్‌ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి.

చెన్నైకి చెందిన రేవతి పద్మావతి ట్రావెల్స్‌ సంస్థ భక్తుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో సదరు సంస్థపై టీటీడీ విజిలెన్స్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. భక్తులు  www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే తమ ఆధార్‌ కార్డు నంబర్, చిరునామాతో టికెట్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులు దళారులను ఆశ్రయించి నష్ట పోవద్దని కోరింది.  

మరిన్ని వార్తలు