జాతీయ స్థాయిలో ఏపీ వైద్యశాఖకు రెండు అవార్డులు 

10 Dec, 2022 03:24 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. రాష్ట్ర వైద్యశాఖకు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు లభించాయి. పల్లె ప్రజలకు వైద్యసేవలు చేరువచేయడం కోసం నెలకొలి్పన డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల నిర్వహణ, వీటిలో టెలీ మెడిసిన్‌ వైద్యసేవలను అమలు చేస్తున్నందుకు గానూ యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌(యూహెచ్‌సీ) డే సందర్భంగా కేంద్ర వైద్యశాఖ ప్రదానం చేస్తున్న అవార్డులకు రాష్ట్రం ఎంపికైంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శని, ఆదివారాల్లో నిర్వహించనున్న యూహెచ్‌సీ డే వేడుకల్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, అధికారులు పాల్గొని అవార్డులు స్వీకరించనున్నారు.  

విలేజ్‌ క్లినిక్‌లతో వైద్యసేవలు చేరువ 
గ్రామీణ ప్రజలకు వైద్యసేవలను చేరువచేయడం కోసం ప్రభుత్వం 10,032 డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను నెలకొల్పుతోంది. నాడు–నేడు కింద క్లినిక్‌లను రూ.1,692 కోట్లతో ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే 8,351 క్లినిక్‌లు ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాయి. వీటిని ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్, వెల్నెస్‌ సెంటర్‌(ఏబీ–హెచ్‌డబ్ల్యూసీ)లుగా నిర్వహిస్తున్నారు. ఈ సేవలకు గానూ రాష్ట్ర వైద్య­శాఖ అవార్డుకు ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఏపీ సహా 20­రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అవా­ర్డులు అందిస్తున్నారు. అవార్డుకు ఎంపికైన అన్ని రాష్ట్రా­ల్లో విలేజ్‌ క్లినిక్‌ల నిర్వహణలో ఏపీ అగ్రస్థానంలో ఉండటం విశేషం. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలకు 12రకాల వైద్యసేవలు, 14 రకాల వైద్యపరీక్షలు, 67రకాల మందులను అందిస్తున్నారు. 

2.84కోట్ల మందికి టెలీ మెడిసిన్‌ సేవలు
అన్ని వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లలో టెలీ మెడిసిన్‌ సేవలు అమలవుతున్నాయి. క్లిని­క్‌కు వచ్చిన ప్రజలకు పీహెచ్‌సీ వైద్యుడు, స్పెషలిస్ట్‌ వైద్యుల కన్సల్టేషన్‌ అవసరమైతే టెలీ మెడిసిన్‌ ద్వారా కూడా అందుతున్నాయి. టెలీ మెడిసిన్‌ సేవల కోసం రాష్ట్రవ్యాప్తంగా 27 హబ్‌లను వైద్యశాఖ ఏర్పా­టు చేసింది. వీటిలో జనరల్‌ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్, ఇతర స్పెషలిస్ట్‌ వైద్యు­­లు అందుబాటులో ఉంటారు. రాష్ట్రం­లో 2019 నుంచి 2.84 కోట్ల టెలీ కన్సల్టేషన్‌లు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 8 కోట్ల కన్సల్టేషన్‌లు నమోదు కాగా, ఏపీ నుంచి 2.84కోట్లు ఉండటం విశేషం. విలేజ్‌ క్లినిక్‌లలో టెలీ మెడిసిన్‌ సేవల్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో మూడు రాష్ట్రాలకు అవార్డు­లు దక్కగా, అందులో ఏపీ ఒకటి కాగా, మిగిలి­నవి తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి. 

మరిన్ని వార్తలు