ఏపీ: రెండురోజులు పాటు భారీవర్షాలు

16 Aug, 2020 16:02 IST|Sakshi

ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక 

కాజ్‌వేలపై ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోన్న నీరు

పొంగి పొర్లుతున్న వాగులు

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు భారీవర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి శ్రీకాంత్‌ వెల్లడించారు. కృష్ణా జిల్లాతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీగా వర్షాలు నమోదవుతాయని పేర్కొన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
తూర్పుగోదావరి: గోదావరి వరద ఉధృతి క్రమం పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో  14,63,902 క్యూసెక్కులుగా నమోదయ్యింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం  తూర్పుగోదావరిలో రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఒక  ఎన్డీఆర్ఎఫ్ బృందం.. పశ్చిమ గోదావరిలో రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించినట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. లోతట్టు ప్రాంత, లంక గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

నీటమునిగిన పంటపొలాలు
కృష్ణా జిల్లా: ఎడతెరిపిలేని వర్షాలతో కృష్ణా జిల్లాలోమున్నేరు, వైరా, కట్టలేరు, కూచివాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదస్థాయిలో కాజ్‌వేలపై నీరు ప్రవహిస్తోంది. పంటపొలాలు నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. నీటి ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. ఇన్ ఫ్లో 1,20,000 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 1,12,000 క్యూసెక్కులుగా నమోదయ్యింది. 70 గేట్లను ఎత్తివేసి నీటిని వదులుతున్నారు. ఈ రాత్రికి  1,50,000 క్యూసెక్కుల వరద రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు‌ అప్రమత్తం చేశారు. లంక గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధి​కారులను కలెక్టర్‌ ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధమవుతున్నాయి.

మరిన్ని వార్తలు