విషాదం: కన్నీరే మిగిలిందిక నేస్తం!

12 Jun, 2021 07:57 IST|Sakshi
నివేద, ఉమామహేశ్వరి(ఫైల్‌)

వ్యవసాయబావిలో పడి ఇద్దరు బాలికల మృతి  

ఆ బాలికలు స్నేహితులు. ఇద్దరూ కలిసి ఒకే పాఠశాలలో చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలకు సెలవులివ్వడంతో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండాలని భావించారు. ఇంటి వద్ద ఉన్న ఆవులను మేత కోసం సమీపంలోని పొలాల్లో తోలారు. దాహం వేయడంతో పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో దిగి నీళ్లు తెచ్చుకునే క్రమంలో కాలు జారి అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఒకే గ్రామంలో ఇద్దరు బాలికలు మృతిచెందడంతో విషాదం అలముకుంది.

తొట్టంబేడు: మండలంలోని శివనాథపురానికి చెందిన బాలమురుగన్, కౌసల్య దంపతుల కుమార్తె నివేత(12), మనోహర్, పద్మావతి దంపతుల కుమార్తె ఉమామహేశ్వరి(12) మంచి స్నేహితులు. శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏడు, ఆరు తరగతులు చదువుతున్నారు. శుక్రవారం మేతకోసమని ఆవులను తోలుకుని పొలాల్లోకి వెళ్లారు.

దాహం వేయడంతో పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి ఒకరినొకరు చేయిచేయి పట్టుకుని దిగారు. వాటర్‌ బాటిల్‌లో నీళ్లు తీసుకుని పైకి ఎక్కే క్రమంలో కాలుజారి ఇద్దరూ బావిలో పడిపోయారు. వారి వెంట ఉన్న మరికొందరు స్నేహితులు కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న చిట్టత్తూరు సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ మధు హుటాహుటిన బావివద్దకు చేరుకున్నారు. మొదట నివేద మృతదేహాన్ని బయటకు తీశారు. ఉమామహేశ్వరి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి ఉమామహేశ్వరి మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: క్షుద్ర పూజలు: యువతిని అర్ధనగ్నంగా కూర్చోబెట్టి..   
దొంగలుగా మారిన పోలీసులు.. తనిఖీల పేరుతో...

మరిన్ని వార్తలు