ఆయువు తీసిన వాయువు.. తోటి కార్మికుడు ఎంతకూ బయటకు రాకపోవడంతో..

30 Nov, 2021 07:50 IST|Sakshi
మణికంఠ (ఫైల్‌), దుర్గాప్రసాద్‌ (ఫైల్‌)

పరవాడ ఫార్మా సిటీలో ఇద్దరు కార్మికుల దుర్మరణం

పరవాడ (పెందుర్తి): విశాఖ జిల్లా పరవాడ మండలంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలో రాంకీ ఇంటర్మీడియట్‌ పంప్‌ హౌస్‌ వద్ద ఆదివారం రాత్రి విష వాయువులు లీకై ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.  పాయకరావుపేటకు చెందిన మణికంఠ(22), తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన అన్నంరెడ్డి దుర్గాప్రసాద్‌ ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 10.05 గంటల సమయంలో దుర్గాప్రసాద్‌ పంప్‌ హౌస్‌ లోపలికి వెళ్లి మ్యాన్‌ హోల్‌ తెరవగా.. వాల్వ్‌ నుంచి అధిక మొత్తంలో విష వాయువులు లీకై గది నిండా వ్యాపించాయి. దీంతో దుర్గాప్రసాద్‌ ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయాడు.

అతడు ఎంతకీ బయటకు రాకపోవడంతో మణికంఠ గది లోపలికి వెళ్లాడు. అతను కూడా విష వాయువులను పీల్చడంతో ఊపిరాడక పడిపోయాడు. ఇద్దర్నీ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మరణించారు.  రాంకీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.27 లక్షల చొప్పున పరిహారం, దహన సంస్కారాల నిమిత్తం రూ.50 వేల చొప్పున చెల్లించేందుకు రాంకీ యాజమాన్యం అంగీకరించింది. 

మరిన్ని వార్తలు