ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు చేయూత

27 May, 2023 04:17 IST|Sakshi

2024 మార్చి నాటికి 21.50 ట్రిలియన్ల వ్యాపార సాధనే లక్ష్యం

రీజనల్‌ సమావేశంలో యూబీఐ సీఈవో మణిమేఖలై

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు చేయూతనిస్తూ..ఖాతాదారులు ‘ఇష్టపడే బ్యాంకు’గా తీర్చిదిద్దా­లన్న సంకల్పంతో ముందుకెళ్తున్నట్టు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో మణిమేఖలై అన్నారు. విజయవాడ, గుంటూ­రు, మచిలీపట్నం, ఒంగోలు, నరసరావుపేట రీజియన్ల సమా­వేశం శుక్రవారం విజయవాడ టౌన్‌ హాలులో జరిగింది. సీఈవో మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో సైతం బ్యాంకును విస్తరిం­చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

ఖాతాదారుల ఆధారంగా వ్యాపార విస్తరణ, మార్కెట్‌ వాటా, లాభదాయ­కతను పెంచుకునేందుకు ఫోకస్డ్‌ విధానంతో కార్యాచరణ రూపొందించామని తెలిపారు. 2024 మార్చి నాటికి 21.50 ట్రిలియన్ల గ్లోబల్‌ వ్యాపారాన్ని సాధించి అంతర్జాతీయంగా 3వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ఇందుకోసం 100 రోజుల అజెండాతో, నాలుగు ముఖ్య లక్ష్యాల­ను నిర్ధేశించుకున్నామన్నారు.

అబ్‌ నారీ కి బారీ పథకం కింద 2023 జూలై 31 నాటికి 1.25 లక్షల మíహిళా పారిశ్రామికవేత్తలకు, కృషి కే సాథ్‌ మహిళా వికాస్‌ పేరిట కనీసం 50 వేల మంది వ్యవసాయ ఔత్సాహికులకు పెద్ద ఎత్తున ఆర్థిక చేయూత­నివ్వను­న్నామని చెప్పారు. క్యూఆర్, పీవోఎస్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కనీసం 25 శాతం సీడీ ఖాతాలను డిజిటలైజేషన్‌ చేయనున్నామన్నారు. ఆయా జిల్లాల్లో డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. సమావేశంలో సీజీఎం లాల్‌ సింగ్, హెచ్‌ఆర్‌ జోనల్‌ హెడ్‌ నవనీత్‌కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు