ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు

12 Dec, 2022 17:10 IST|Sakshi

2జీ ఇథనాల్ రిఫైనరీలకు ఆర్థిక సాయం

సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను మిశ్రమం చేయాలన్న లక్ష్య సాధనలో 2జీ (రెండో తరం) ఇథనాల్‌ కీలకం కానున్నట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలీ వెల్లడించారు. అందుకోసం 2జీ బయో ఇథనాల్‌ రిఫైనరీల ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రశ్నకు రాతపూర్వకంగా బదులిస్తూ చెప్పారు.

ప్రభుత్వ ఆయిల్‌ రంగ సంస్థలు ఈ ఏడాది నవంబర్‌ 15 నాటికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి 16.19 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి గడిచిన 5 సంవత్సరాలలో 385.92 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ప్రభుత్వ రంగ ఆయిల్‌ సంస్థలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.

2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని సాధించేందుకు రెండో తరం ఇథనాల్ ఉత్పత్తిని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారన్న ప్రశ్నకు మంత్రి  బదులిస్తూ ప్రధాన మంత్రి జేఐ-వన్ (జీవ్ ఇంధన్- వాతావరణ్ అనుకూల్ ఫసల్ అవశేష్ నివారణ్) యోజన పథకం కింద సెల్లులోసిక్, లింగో సెల్లులోసిక్ బయోమాస్ నుంచి అలాగే పెట్రో కెమికల్ మార్గం ద్వారా 2జీ ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు 2 జీ ఇథనాల్ బయో రిఫైనరీస్‌ను పెద్ద ఎత్తు ఏర్పాటు చేయాలని తలపెట్టినట్లు మంత్రి వెల్లడించారు.

ఈ రిఫైనరీలకు తగిన విధంగా ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు తెలిపారు. వరి దుబ్బు, ఇతర పంట వ్యర్థాల ఆధారిత 2జీ ఇథనాల్ బయో రిఫైనరీలు పంజాబ్, హర్యానా, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. హర్యానాలోని పానిపట్‌లో నెలకొల్పిన బయో రిఫైనరీని జాతికి అంకితం చేసినట్లు తెలుపారు. బయోమాస్ సేకరణ కోసం ప్రభుత్వ రంగ ఆయిల్‌ సంస్థలు వివిధ రాష్ట్రాలు, రైతులు, ఇతర భాగస్వాములతో సమన్వయం చేసుకుంటోందని మంత్రి తెలిపారు

ఏపీలో లక్షా 90 వేల వీధి వర్తకులకు స్వానిధి రుణాలు
ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1,90,433 మంది వీధి వర్తకులకు రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,12,744 మందికి, 2021-22 లో 70,415 మందికి, 2022-23 లో 7,274 మందికి మొదటి దశ కింద ఒక్కొక్కరికి 10 వేల రూపాయల రుణం మంజూరు చేసినట్లు తెలిపారు. మొదటి తీసుకున్న రుణం సక్రమంగా చెల్లించిన వారికి రెండవ దఫా రుణం కింద 20 వేల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు.

మూడవ దశ కింద 251 మందికి 50 వేల రూపాయల రుణం అందించినట్లు మంత్రి తెలిపారు. అలాగే వడ్డీ సబ్సిడీ కింద 3 కోట్ల రూపాయలు, క్యాష్ బ్యాక్ కింద కోటి 65 లక్షల రూపాయలు లబ్దిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 4 నాటికి పీఎం స్వానిధి పథకం కింద రుణాల కోసం ఏపీ నుంచి 4 లక్షల దరఖాస్తులు అందగా అందులో 67,404 దరఖాస్తులు అర్హత లేనివిగా గుర్తించి తిరస్కరించినట్లు తెలిపారు. 16,118 దరఖాస్తులు మంజూరు దశలో ఉన్నాయని, 29,853 మంది బ్యాంకులకు అందుబాటులో లేని కారణంగా రుణాల పంపిణీ పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వివరించారు.

కోవిడ్ మహమ్మారి కారణంగా కుదేలైన వీధి వర్తకులు తిరిగి వారి వ్యాపార కార్యకలాపాలను కొనగించుకునేందుకు వర్కింగ్ కాపిటల్ కింద 10 వేల  రూపాయలు రుణం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వానిధి పథకాన్ని 2020 జూన్ 1న ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించిన వారికి రెండవ దఫా రుణం కింద 20 వేలు, మూడవ దఫా కింద 50 వేల రూపాయలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సకాలంలో రుణం చెల్లించిన వారికి తీసుకున్న రుణంపా 7 శాతం వడ్డీ రాయితీ, డిజిటల్ చెల్లింపులు చేసిన వారికి క్యాష్ బ్యాక్ కింద ఏడాదికి 1200 రూపాయలు చెల్లించినట్లు మంత్రి పేర్కొన్నారు.
చదవండి: ఏపీలో భారీగా ఉద్యోగావకాశాలు.. వేల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్

మరిన్ని వార్తలు